తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు

- July 29, 2026 , by Maagulf
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఢిల్లీలోని తెలంగాణ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి (సీఓఓ) నాగ భరత్ డాకా ఇటీవల సంస్థ సాధించిన చారిత్రాత్మక విజయాన్ని ముఖ్యమంత్రికి వివరించారు.

జూలై 18, 2026న స్కైరూట్ ఏరోస్పేస్ విజయవంతంగా ప్రయోగించిన 'విక్రమ్-1' భారతదేశంలో ప్రైవేట్ రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనంగా చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేట్ రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని వివరించారు.

సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ ఎకోసిస్టమ్, వినూత్న ఆవిష్కరణలు, అధునాతన తయారీ రంగం, పరిశోధన మరియు అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ), అలాగే రాష్ట్ర ప్రభుత్వం–ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులను అభినందిస్తూ, భారత అంతరిక్ష రంగాన్ని ప్రపంచ స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా వారు సాధించిన విజయం గర్వకారణమని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లు, హైటెక్ పరిశ్రమలు, ఆవిష్కరణలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ప్రపంచ స్థాయి పారిశ్రామిక, సాంకేతిక ఎకోసిస్టమ్‌ను రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్రాన్ని ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com