మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!

- July 31, 2026 , by Maagulf
మారనున్న విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు!

విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్న శుభవేళ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ విశాఖపట్నం నగరానికి భారీ తీపి కబురు అందించింది. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని రాక కోసం ఏర్పాట్లు జరుగుతుండగానే, విశాఖపట్నం రైల్వే స్టేషన్ కోచింగ్ యార్డ్ రీమోడలింగ్/ఆధునీకీకరణ ప్రాజెక్టుకు రూ.299 కోట్ల నిధులను మంజూరు చేసింది. సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) పరిధిలోని ఈ ప్రాజెక్ట్ ద్వారా విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.

ప్రతిపాదిత ఆధునీకీకరణ పనుల వివరాలు

కొత్త ప్లాట్‌ఫామ్‌లు & రైలు మార్గాలు: ప్రస్తుతం ఉన్న 6 ప్లాట్‌ఫామ్‌లను మరింత విస్తరించడంతో పాటు అదనంగా కొత్తగా 6 ప్లాట్‌ఫామ్‌లను, 6 కొత్త రైల్వే లైన్లను నిర్మిస్తారు.
ట్రాఫిక్ & సిగ్నలింగ్ సమస్యల పరిష్కారం: విశాఖ స్టేషన్‌కు ప్రతిరోజూ 113 రైళ్లు, సుమారు 80,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ప్రవేశ మార్గంలో రైళ్ల క్రాసింగ్ సమస్యల వల్ల సిగ్నల్స్ దగ్గర నిలిపివేత (Detention Time) తగ్గుతుంది.
ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ (EI): స్టేషన్ యార్డ్‌లో రద్దీని తగ్గించి రైళ్ల రాకపోకలు సజావుగా సాగేలా ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తారు.
PM Modi AP Visit: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు
లిఫ్ట్‌లు & ఎస్కలేటర్లు: విస్తరించిన ప్లాట్‌ఫామ్‌లపై ప్రయాణికులు సులభంగా రాకపోకలు సాగించేందుకు ర్యాంపులు, లిఫ్ట్‌లు మరియు ఎస్కలేటర్ల సంఖ్యను పెంచుతారు.
తూర్పు వైపు కొత్త ప్రవేశ ద్వారం: రైల్వే స్టేషన్ ఈస్టర్న్ సైడ్ కొత్త ఎంట్రెన్స్ కాంప్లెక్స్‌తో పాటు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS) కౌంటర్లను పునర్నిర్మిస్తారు.
సర్ఫేస్ పార్కింగ్: స్టేషన్ ఆవరణలో వాహనాల పార్కింగ్ క్రమబద్ధీకరణ కోసం విశాలమైన సర్ఫేస్ పార్కింగ్ ప్రణాళికను అమలు చేయనున్నారు.
ఈ భారీ ఆధునీకీకరణ పూర్తయితే విశాఖపట్నం రైల్వే స్టేషన్ నిర్వహణ సామర్థ్యం గణనీయంగా పెరగడమే కాకుండా, రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లను ప్రారంభించడానికి మార్గం సుగమం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com