కువైట్‌లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..

- August 01, 2026 , by Maagulf
కువైట్‌లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..

రియాద్: కువైట్‌లోని బుబియాన్ ద్వీపంలో ప్రభుత్వ భవనం, ప్రైవేట్ కంపెనీకి చెందిన పౌర వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ జరిపిన దాడులను గల్ఫ్ సహకార మండలి (జీసీసీ) ప్రధాన కార్యదర్శి జాసెం మొహమ్మద్ అల్‌బుదైవి తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో అల్‌బుదైవి మాట్లాడుతూ, ఇరాన్ ఈ దాడుల ద్వారా ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే తన శత్రుత్వ ధోరణిని మరోసారి కొనసాగించిందని విమర్శించారు.

కువైట్ సార్వభౌమాధికారంపై ఇది బహిరంగ దాడి అని, దేశ భద్రత, స్థిరత్వంతో పాటు అక్కడి పౌరులు, నివాసితుల ప్రాణాలకు కూడా ఇది ప్రత్యక్ష ముప్పుగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చర్యలు అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి (యూఎన్) చార్టర్ సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమేనని అన్నారు.

కువైట్ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు ఆ దేశం తీసుకునే అన్ని చర్యలకు జీసీసీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అల్‌బుదైవి స్పష్టం చేశారు.

ప్రాంతంలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, ఉద్రిక్తతలను మరింత పెంచే చర్యలను విరమించాలని జీసీసీ పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com