2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- August 02, 2026
దుబాయ్: ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థగా దుబాయ్ మరోసారి తన సత్తా చాటింది. 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్లోని ప్రజా రవాణా, షేర్డ్ మొబిలిటీ సేవలు, టాక్సీలను కలిపి 348.1 మిలియన్ల మంది ప్రయాణికులు వినియోగించినట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. రోజుకు సగటున 19 లక్షల మంది ఈ సేవలను ఉపయోగించినట్లు వెల్లడించింది.
ఈ గణాంకాల్లో దుబాయ్ మెట్రో, ట్రామ్, పబ్లిక్ బస్సులు, మెరైన్ ట్రాన్స్పోర్ట్, టాక్సీలు, యాప్ ఆధారిత వాహనాలు, గంటల వారీ అద్దె వాహనాలు, బస్-ఆన్-డిమాండ్ సేవలు ఉన్నాయి. అదనంగా లిమోసిన్ సేవలను 57 లక్షల మంది వినియోగించారు.
ఆర్టీఏ డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్ మట్టర్ అల్ తయర్ మాట్లాడుతూ, ఈ గణాంకాలు ప్రపంచ స్థాయి, సమగ్ర, సుస్థిర రవాణా వ్యవస్థను నిర్మించాలన్న దుబాయ్ లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజా రవాణాను నివాసితులు, పర్యాటకులు తమ తొలి ఎంపికగా మార్చడంలో ప్రభుత్వం విజయవంతమైందని పేర్కొన్నారు.
ప్రజా రవాణా వినియోగం గణనీయంగా పెరుగుతోంది
2006లో ప్రజా రవాణా, షేర్డ్ మొబిలిటీ ద్వారా జరిగిన ప్రయాణాల వాటా కేవలం 6 శాతం ఉండగా, 2025 నాటికి అది 22.3 శాతానికి పెరిగిందని అల్ తయర్ తెలిపారు. 2030 నాటికి ఈ వాటాను 25 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో ఆర్టీఏ ముందుకు సాగుతోందన్నారు.
భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు
ప్రస్తుతం 30 కిలోమీటర్ల పొడవు, 14 స్టేషన్లతో దుబాయ్ మెట్రో బ్లూ లైన్ నిర్మాణం కొనసాగుతోందని, ఇది సుమారు 10 లక్షల జనాభా ఉన్న తొమ్మిది కీలక ప్రాంతాలకు సేవలు అందించనుందని తెలిపారు.
అలాగే 42 కిలోమీటర్ల పొడవు, 18 స్టేషన్లతో AED 34 బిలియన్ల వ్యయంతో మెట్రో గోల్డ్ లైన్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించిందన్నారు. ఇది పూర్తిగా భూగర్భంలో నిర్మించబడే దుబాయ్ తొలి మెట్రో లైన్గా నిలుస్తుందని, రెడ్, గ్రీన్ మెట్రో లైన్లతో పాటు ఎతిహాద్ రైల్కు అనుసంధానం అవుతుందని చెప్పారు.
ఎలక్ట్రిక్ బస్సులు, డ్రైవర్లెస్ టాక్సీలు
ఆర్టీఏ ఇప్పటికే 637 కొత్త బస్సులను దశలవారీగా ప్రవేశపెడుతోంది. వీటిలో 40 ఎలక్ట్రిక్ బస్సులు ఉండగా, ఇది యూఏఈలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ ప్రాజెక్టుగా నిలిచింది. 2050 నాటికి అన్ని ప్రజా రవాణా బస్సులను ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఆధారిత వాహనాలుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
ఈ ఏడాది ప్రారంభంలోనే డ్రైవర్లెస్ టాక్సీలు సేవలు ప్రారంభించామని, ఈ ఏడాది చివర్లో ఎయిర్ టాక్సీ వాణిజ్య సేవలను కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఆర్టీఏ వెల్లడించింది.
మెట్రోకే అత్యధిక ఆదరణ
మొత్తం ప్రయాణాల్లో 39.2 శాతం దుబాయ్ మెట్రో ద్వారా జరిగాయి. తరువాత టాక్సీలు (25.5%), పబ్లిక్ బస్సులు (24.4%) నిలిచాయి. ఈ మూడు సేవలే మొత్తం ప్రయాణాల్లో సుమారు 89 శాతం వాటాను నమోదు చేశాయి.
ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా 7.34 కోట్ల మంది ప్రజా రవాణాను వినియోగించగా, మిగతా నెలల్లో నెలకు 4.9 కోట్ల నుంచి 6.6 కోట్ల మధ్య ప్రయాణికులు నమోదయ్యారు.
అత్యంత రద్దీగా ఉన్న మెట్రో స్టేషన్లు
2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ మెట్రో రెడ్, గ్రీన్ లైన్లలో కలిపి 13.65 కోట్ల మంది ప్రయాణించారు.
రెడ్, గ్రీన్ లైన్లను అనుసంధానించే బుర్జుమాన్ స్టేషన్ అత్యధికంగా 84 లక్షల మంది, యూనియన్ స్టేషన్ 65 లక్షల మంది ప్రయాణికులతో అగ్రస్థానాల్లో నిలిచాయి.
రెడ్ లైన్లో అల్ రిగ్గా స్టేషన్ (64 లక్షలు), మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్ (52 లక్షలు), బిజినెస్ బే (50 లక్షలు) అత్యంత రద్దీగా నమోదయ్యాయి.
గ్రీన్ లైన్లో షరఫ్ డీజీ స్టేషన్ (49 లక్షలు), బనియాస్ స్క్వేర్ (38 లక్షలు), స్టేడియం స్టేషన్ (37 లక్షలు) అత్యధిక ప్రయాణికులను నమోదు చేశాయి.
ఇక తొలి ఆరు నెలల్లో దుబాయ్ ట్రామ్ ద్వారా 38 లక్షల మంది, పబ్లిక్ బస్సులు ద్వారా 8.51 కోట్ల మంది, మెరైన్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 81 లక్షల మంది, షేర్డ్ మొబిలిటీ సేవలు ద్వారా 2.57 కోట్ల మంది, టాక్సీలు ద్వారా 8.89 కోట్ల మంది ప్రయాణించినట్లు ఆర్టీఏ వెల్లడించింది.
దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్, దుబాయ్ ఎకనామిక్ అజెండా D33 లక్ష్యాలకు అనుగుణంగా ప్రజా రవాణా, స్మార్ట్ మొబిలిటీ, సైక్లింగ్ నెట్వర్క్లు, పాదచారుల మార్గాలు, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ వ్యవస్థలను మరింత విస్తరిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమ సుస్థిర రవాణా నగరంగా దుబాయ్ను తీర్చిదిద్దేందుకు ఆర్టీఏ కృషి కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- హోర్ముజ్ జలసంధిలో కొత్త సముద్ర మార్గంపై ఇరాన్–ఒమాన్ ఒప్పందం దిశగా కీలక పురోగతి
- 2026 తొలి ఆరు నెలల్లో దుబాయ్ ప్రజా రవాణాలో 34.81 కోట్ల ప్రయాణాలు..
- సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్తో ట్రంప్ కీలక చర్చలు.
- కూటమి సర్కార్ పై జగన్ ఫైర్
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్, జోర్డాన్ రాజులు..
- ఆపదలో అండగా హరీష్ రావు..పేద విద్యార్థిని చదువుకు చేయూత
- పర్యాటకులకు ఒమాన్ గుడ్ న్యూస్..
- అదనపు పన్నుల వాటా కేటాయింపు..కేంద్రానికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
- మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్







