సైబరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. 311 మంది పై కేసులు

- August 09, 2026 , by Maagulf
సైబరాబాద్‌లో వీకెండ్ స్పెషల్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌.. 311 మంది పై కేసులు

హైదరాబాద్‌: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 311 మందిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు సైబరాబాద్ ట్రాఫిక్ ADCP (అడ్మిన్) జి. నరేందర్ తెలిపారు.

ఈ డ్రైవ్‌లో 238 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది ఆటో డ్రైవర్లు, 56 మంది కార్ల డ్రైవర్లు, ఒక హెవీ వాహన డ్రైవర్‌పై కేసులు నమోదు చేశారు.

బ్లడ్ ఆల్కహాల్ కాన్సంట్రేషన్ (BAC) ఆధారంగా పరిశీలించగా.. 255 మంది 36 నుంచి 200 మిల్లీగ్రాములు/100 మిల్లీలీటర్ల మధ్య, 38 మంది 201 నుంచి 300 మిల్లీగ్రాములు/100 మిల్లీలీటర్ల మధ్య, 18 మంది 301 నుంచి 550 మిల్లీగ్రాములు/100 మిల్లీలీటర్ల మధ్య ఆల్కహాల్ స్థాయితో పట్టుబడ్డారు.

కేసులు నమోదైన వారందరినీ చట్టపరమైన చర్యల్లో భాగంగా కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు

మద్యం సేవించి వాహనం నడపడం తీవ్రమైన నేరమని సైబరాబాద్ పోలీసులు మరోసారి హెచ్చరించారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమైతే భారతీయ న్యాయ సంహిత (BNS)–2023లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఈ నేరానికి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గత వారం 283 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసుల పరిష్కారం

ఇదిలా ఉండగా, ఆగస్టు 3 నుంచి 8, 2026 వరకు మొత్తం 283 డ్రంక్‌ డ్రైవింగ్‌ కేసులను కోర్టులు పరిష్కరించాయి. వీటిలో ఒకరికి జరిమానాతో పాటు జైలు శిక్ష, 11 మందికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్ శిక్ష, మరో 271 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com