ఒమన్‌ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!

- August 16, 2026 , by Maagulf
ఒమన్‌ తీరంలో ఆయిల్ కాలుష్యం.. 12 కిలోమీటర్ల మేర ప్రభావం..!!

మస్కట్: ఒమన్‌ తీర ప్రాంతాల్లో ఏర్పడిన చమురు కాలుష్యంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ, పరిశీలన, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనల్లో రాస్ మద్రకా ప్రాంతంలో సుమారు 12 కిలోమీటర్ల మేర తీరప్రాంతం చమురు కాలుష్యానికి గురైనట్లు గుర్తించారు. ప్రభావిత తీరప్రాంతంలో ప్రత్యేక బృందాలు ప్రస్తుతం శుభ్రపరిచే, నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. ఇదే సమయంలో పర్యవేక్షిస్తున్న ఇతర ప్రాంతాల్లో కాలుష్య ఆనవాళ్లు కనిపించలేదని ఒమన్ ఎన్విరాన్‌మెంట్ అథారిటీ తెలిపింది.

తాజా పరిశీలనల్లో మసీరా ద్వీపం తీరానికి ఇప్పటివరకు చమురు కాలుష్యం చేరలేదని అధికారులు నిర్ధారించారు. అయితే ద్వీపంలోని దక్షిణ ప్రాంతం కాలుష్యం ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతంలో ఉండటంతో అక్కడ కూడా అప్రమత్తంగా పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. సముద్రంలో ఉన్న ఆయిల్ స్లిక్‌ (చమురు పొర) ప్రస్తుతం మసీరా విలాయత్‌కు ఆగ్నేయ దిశగా సముద్రంలోకి, బహిరంగ సముద్రం వైపు కదులుతున్నట్లు తాజా పర్యవేక్షణ డేటా, నమూనాలు సూచిస్తున్నాయి. సముద్ర, వాతావరణ పరిస్థితుల్లో మార్పులను పరిగణనలోకి తీసుకుని అధికారులు దాని కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తున్నారు.

చేపల భద్రతపై ప్రత్యేక నిఘా

చమురు కాలుష్యం నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ సెంటర్ చేపలు, ఇతర సముద్ర ఆహార ఉత్పత్తుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సీఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు, చేపల మార్కెట్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చేపలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనే వివరాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. చేపలు, ఇతర మత్స్య ఉత్పత్తుల నమూనాలను సేకరించి ప్రయోగశాలల్లో పరీక్షలు చేస్తున్నారు. వీటి ద్వారా కాలుష్యం ప్రభావం ఏమైనా ఉందా, వినియోగానికి చేపలు సురక్షితంగా ఉన్నాయా అనే అంశాలను నిర్ధారిస్తున్నారు. అరేబియా సముద్రానికి ఆనుకుని ఉన్న గవర్నరేట్లలో తీరప్రాంతాలు, చేపలు దిగించే కేంద్రాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలను ఏర్పాటు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com