స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న ఏడాది చిన్నారికి దుబాయ్ రూలర్ అండ
- August 21, 2026
దుబాయ్: స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA)తో బాధపడుతున్న ఏడాది వయసున్న జోర్డాన్ చిన్నారి చికిత్సకు దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పూర్తి ఆర్థిక సహాయం అందించనున్నారు. చిన్నారి కుటుంబం చికిత్స కోసం చేసిన విజ్ఞప్తి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
దుబాయ్ మీడియా కార్యాలయం గురువారం, ఆగస్టు 20న విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. కట్యా అబు అల్ సౌద్ చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును దుబాయ్ రూలరే భరించనున్నారు. దుబాయ్లోని అల్ జలీలా హాస్పిటల్లో చిన్నారికి చికిత్స అందించనున్నారు.
చిన్నారి చికిత్సకు సుమారు 2.4 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని కుటుంబం తెలిపింది. ఈ మొత్తాన్ని భరించే స్థోమత తమకు లేదని పేర్కొంది. జోర్డాన్లో అందుబాటులో లేని ప్రత్యేక జన్యు చికిత్స ఇంజెక్షన్ను చిన్నారికి అందించాల్సి ఉంది.
వైద్యుల ప్రకారం ఈ కీలక చికిత్సను చిన్నారికి రెండేళ్ల వయస్సు వచ్చేలోపు అందించాల్సి ఉంటుంది. దీంతో కుటుంబం చికిత్స కోసం సమయంతో పోరాడుతోంది. చిన్నారి పరిస్థితిపై సోషల్ మీడియాలో విస్తృతంగా స్పందన రావడంతో కుటుంబం ఆన్లైన్ ద్వారా నిధుల సేకరణ ప్రారంభించింది. వచ్చిన విరాళాలను అమెరికాలోని ఒక ఖాతాకు బదిలీ చేస్తున్నారు.
ఇప్పుడు దుబాయ్ రూలర్ ముందుకు వచ్చి చికిత్స మొత్తాన్ని భరించేందుకు అంగీకరించడంతో చిన్నారి కుటుంబానికి భారీ ఊరట లభించింది.
గతంలోనూ చిన్నారులకు చికిత్సకు సహాయం
అవసరంలో ఉన్న చిన్నారులకు వైద్య సహాయం అందించడంలో షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గతంలోనూ ఉదారత చాటుకున్నారు.
గత ఏడాది జూలైలో SMAతో బాధపడుతున్న తన కుమార్తె చికిత్స కోసం సహాయం కోరిన సిరియా తండ్రి విజ్ఞప్తి పై స్పందించిన షేక్ మహమ్మద్, చికిత్సకు అవసరమైన Dh7 మిలియన్ల మొత్తాన్ని పూర్తిగా భరిస్తామని ప్రకటించారు.
అలాగే 2021 మార్చిలో ఇరాక్కు చెందిన ఓ తల్లి తన 19 నెలల కుమార్తె ప్రాణాలను కాపాడేందుకు Dh8 మిలియన్ల చికిత్స ఖర్చు కోసం సహాయం కోరుతూ చేసిన భావోద్వేగ విజ్ఞప్తికి కూడా షేక్ మహమ్మద్ స్పందించారు. ఆ చిన్నారి లవీన్ జబ్బార్ అల్ కుట్యాషికి అల్ జలీలా చిల్డ్రన్స్ స్పెషాలిటీ హాస్పిటల్లో SMAకు సంబంధించిన జన్యు చికిత్స విజయవంతంగా అందించారు.
ఈ చికిత్సలో ఒకసారి మాత్రమే ఇచ్చే జోల్జెన్స్మా (Zolgensma) ఔషధ ఇన్ఫ్యూషన్ ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వైద్య చికిత్సల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది.
అదేవిధంగా సార్కోమా క్యాన్సర్తో బాధపడుతున్న 15 ఏళ్ల ఫాతిమా అహ్మద్ హసన్ చికిత్సకు కూడా షేక్ మహమ్మద్ పూర్తి ఆర్థిక సహాయం అందించారు. నెలలపాటు చికిత్స అనంతరం ఫాతిమా క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
షేక్ మహమ్మద్ అందిస్తున్న ఇటువంటి వైద్య సహాయాలు ముఖ్యంగా చికిత్స అందుబాటులో లేని పిల్లలకు ప్రాణాలను కాపాడే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఆయన మద్దతుతో పనిచేస్తున్న అల్ జలీలా ఫౌండేషన్ కూడా వైద్య పరిశోధన, చికిత్సా సేవలు, ముఖ్యంగా చిన్నారులకు అవసరమైన వైద్య సహాయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్: మత వర్గాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు..60 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
- స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న ఏడాది చిన్నారికి దుబాయ్ రూలర్ అండ
- సౌదీ విమానాశ్రయం, అరామ్కో కేంద్రంపై దాడులు చేశామని హూతీలు ప్రకటన
- సెప్టెంబర్ 1 నుంచి కువైట్లో విజిట్ వీసా, అబ్సెన్స్ పర్మిట్ పొడిగింపులు నిలిపివేత
- స్పెషలైజ్డ్ వింగ్స్ హెచ్ఓడీలతో డీజీపీ సి.వి.ఆనంద్
- దుబాయ్ రోబోట్యాక్సీ 40 లక్షల కిలోమీటర్లు పూర్తి.. ప్రయాణికుల సంతృప్తి 97 శాతం
- ట్రంప్ హెచ్చరికల పై ఘాటుగా స్పందించిన ఇరాన్
- బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్
- సోషల్ మీడియాలో ఎమిరాతీ మహిళలను అవమానించినందుకు UAE చర్యలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!







