బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
- August 22, 2026
విశాఖపట్నం: బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యువజన, క్రీడల శాఖల మంత్రుల సాంస్కృతిక కార్యక్రమం–2026కు సీఎం చంద్రబాబు నేడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నం కేంద్రంగా ‘బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్నట్లు వెల్లడించారు. బ్రిక్స్ దేశాల మధ్య యువత, క్రీడాకారులు, కోచ్లకు మరింత విస్తృతమైన అవకాశాలు కల్పించేందుకు ఈ నెట్వర్క్ దోహదపడుతుందని అన్నారు.
అథ్లెట్లు, కోచ్ల పరస్పర మార్పిడికి అవకాశం
బ్రిక్స్ దేశాల మధ్య అథ్లెట్లు, కోచ్ల పరస్పర మార్పిడి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ఏపీ సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు. దీనివల్ల క్రీడాకారులు వివిధ దేశాల శిక్షణ విధానాలు, సాంకేతికతలు, అనుభవాలను పరస్పరం పంచుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు.
అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు బ్రిక్స్ దేశాల సహకారం కీలకమని సీఎం పేర్కొన్నారు.
వాటర్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ టూరిజం పై దృష్టి
ఆంధ్రప్రదేశ్లోని విస్తారమైన తీరప్రాంతం, సహజ వనరులను దృష్టిలో ఉంచుకుని వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజం రంగాల్లో పెట్టుబడులకు బ్రిక్స్ దేశాలను ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
విశాఖపట్నాన్ని అంతర్జాతీయ క్రీడా, యువజన కార్యకలాపాలకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. క్రీడలు, పర్యాటకం, పెట్టుబడులు, యువత అభివృద్ధిని అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రానికి కొత్త అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
బ్రిక్స్ దేశాల మధ్య సహకారాన్ని కేవలం ప్రభుత్వ స్థాయిలోనే కాకుండా యువత, క్రీడాకారులు, కోచ్లు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల స్థాయిలోనూ విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు సూచించారు.
విశాఖ కేంద్రంగా ప్రతిపాదిస్తున్న బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ద్వారా భవిష్యత్లో క్రీడా రంగంలో అంతర్జాతీయ సహకారానికి కొత్త మార్గాలు ఏర్పడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో టీం జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
- బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఏపీ సిద్ధం: సీఎం చంద్రబాబు
- సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్కు డీజీపీ సి.వి.ఆనంద్ అభినందనలు
- బీజేపీ కొత్త టీమ్ తో ప్రధాని మోదీ..!
- కార్మికులకు ఆహారం, చల్లని పానీయాలు.. ఇద్దరు మహిళలకు యూఏఈ ప్రభుత్వ సత్కారం
- గచ్చిబౌలి విషాదం పై హైడ్రా సీరియస్..
- ముంబైలో పెట్రోలియం–సహజ వాయువుల స్టాండింగ్ కమిటీ సమావేశాలకు ఎంపీ బాలశౌరి హాజరు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఏఐ ఆధారిత అంతర్జాతీయ న్యాయ సేవలు
- 23 ఏళ్ల తర్వాత ఆన్స్ర్ మాల్ షార్జా నుంచి దుబాయ్, అబుదాబికు తరలింపు..
- మానవత్వానికి ప్రతీకగా ఖతార్ ప్రవాస తెలుగు సమాజం..







