యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్

- August 31, 2026 , by Maagulf
యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్

రియాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ పై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిని గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) తీవ్రంగా ఖండించింది. యూఏఈ ప్రాదేశిక జలాలపైకి వచ్చిన డ్రోన్‌ను దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయని జీసీసీ సెక్రటరీ జనరల్ జాసెమ్ మహ్మద్ అల్‌బుదైవి తెలిపారు.

ఈ దాడి తీవ్రమైన ఉద్రిక్తతకు దారితీసే చర్య అని, యూఏఈ సార్వభౌమాధికారం, భద్రత, స్థిరత్వాన్ని బహిరంగంగా ఉల్లంఘించడమే కాకుండా దేశంలోని పౌరులు, నివాసితుల భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా పరిణమించిందని అల్‌బుదైవి పేర్కొన్నారు.

ఈ మేరకు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. యూఏఈ భద్రత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించే ఎలాంటి చర్యనైనా ఎదుర్కొనే విషయంలో జీసీసీ దేశాలన్నీ యూఏఈకి అండగా ఐక్యంగా నిలుస్తాయని స్పష్టం చేశారు.

ఇరాన్ వెంటనే ఇటువంటి దాడులు, శత్రుత్వపూరిత చర్యలను నిలిపివేయాలని అల్‌బుదైవి డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యల వల్ల ఏర్పడే పరిణామాలకు ఇరాన్ పూర్తిగా బాధ్యత వహించాలని, అవి మొత్తం ప్రాంతం భద్రత, స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

యూఏఈపై జరిగిన ఈ డ్రోన్ దాడి నేపథ్యంలో జీసీసీ నుంచి వెలువడిన తీవ్ర స్పందనతో గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న భద్రతాపరమైన ఉద్రిక్తతలపై ఆందోళనలు మరింత పెరిగాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com