పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్‌–రష్యా సంబంధాల పై కీలక చర్చలు

- August 31, 2026 , by Maagulf
పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్‌–రష్యా సంబంధాల పై కీలక చర్చలు

బిష్కెక్: షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం.

రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్షిక బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్‌ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ భారత్‌కు రావడానికి వారం రోజుల ముందు మోదీతో ఈ భేటీ జరగడం విశేషం.

ఇరు దేశాల మధ్య సంబంధాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించేందుకు నేతలు చర్చించినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇటీవల మాస్కోలో విజయవంతంగా జరిగిన భారత్‌–రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ (IRIGC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఇరు దేశాల మధ్య సహకార పురోగతిని కూడా నేతలు సమీక్షించే అవకాశం ఉంది.

ఇటీవల రష్యా పర్యటనలో భాగంగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ క్రెమ్లిన్‌లో అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ తరఫున పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ సమావేశం జరిగిన కొద్ది రోజులకే మోదీ–పుతిన్ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పెజెష్కియాన్‌తోనూ మోదీ భేటీ

SCO సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో కూడా సమావేశమయ్యారు. కిర్గిజిస్థాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన ఈ భేటీ.. ఇరు నేతల మధ్య రెండేళ్ల తర్వాత జరిగిన తొలి సమావేశంగా నిలిచింది.

ఇక చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్తో కూడా మోదీ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రత్యేక ద్వైపాక్షిక భేటీ అధికారికంగా ఖరారు కాలేదు.

SCO ప్రాధాన్యత

షాంఘై సహకార సంస్థ (SCO)ను 2001లో చైనా, రష్యా, మధ్య ఆసియాకు చెందిన నాలుగు దేశాలు కలిసి భద్రతా వేదికగా ఏర్పాటు చేశాయి. గత పాతికేళ్లలో ఈ సంస్థ సభ్య దేశాల సంఖ్యతో పాటు అంతర్జాతీయ ప్రభావం కూడా పెరిగింది. భద్రత, ఆర్థిక, ప్రాంతీయ సహకారానికి సంబంధించిన అంశాలపై SCO కీలక వేదికగా కొనసాగుతోంది.

బిష్కెక్‌లో జరుగుతున్న SCO సదస్సు నేపథ్యంలో మోదీ వరుసగా రష్యా, ఇరాన్ నేతలతో సమావేశం కావడం.. భారత్‌ తన వ్యూహాత్మక భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేసేందుకు దౌత్యపరంగా చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టం చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com