UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ పాఠ్యాంశం

- September 02, 2026 , by Maagulf
UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ పాఠ్యాంశం

దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పాఠ్యాంశాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన UAE కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి UAE ఉపాధ్యక్షుడు, ప్రధానమంత్రి, దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ అధ్యక్షత వహించారు.

కొత్త AI పాఠ్యాంశంలో AI డేటా, అల్గారిథమ్‌లు, వాటి వినియోగాలు, సాంకేతికతతో ముడిపడిన ప్రమాదాలు వంటి అంశాలను విద్యార్థులకు బోధించనున్నారు. అలాగే AIని నైతికంగా, బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలో విద్యార్థుల్లో అవగాహన కల్పించనున్నారు.

22,000 మంది ఉపాధ్యాయులకు AI శిక్షణ
AI ఆధారిత విద్యా సాధనాలను సమర్థంగా వినియోగించేందుకు సుమారు 22,000 మంది ఉపాధ్యాయులు, విద్యా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బోధన, విద్యార్థుల మూల్యాంకనం, పాఠ్యాంశాల విశ్లేషణ, పాఠాల ప్రణాళిక వంటి కార్యకలాపాల్లో AIని సహాయక సాధనంగా ఉపయోగించడంపై వారికి శిక్షణ అందించనున్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణ దృక్పథాన్ని పెంపొందించడంలోనూ AI సాధనాలను ఉపయోగించేలా ఉపాధ్యాయులను సిద్ధం చేయనున్నారు.

పైలట్ ప్రాజెక్టుకు సానుకూల ఫలితాలు
ప్రభుత్వ పాఠశాలల్లో AI పాఠ్యాంశంపై ఇప్పటికే నిర్వహించిన పైలట్ కార్యక్రమం, దాని మూల్యాంకనంలో సానుకూల ఫలితాలు వచ్చినట్లు UAE కేబినెట్ వెల్లడించింది. ఈ అనుభవాల ఆధారంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో AI విద్యను విస్తరించాలని నిర్ణయించారు.

భవిష్యత్తులో అవసరమయ్యే AI నైపుణ్యాలు, జ్ఞానాన్ని విద్యార్థులకు అందించడంతో పాటు, ఈ సాంకేతికత వల్ల కలిగే అవకాశాలు, ప్రమాదాలపై అవగాహన కల్పించడమే ఈ పాఠ్యాంశం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

ప్రపంచానికి UAE AI పాఠ్యాంశం
విద్యార్థులకు అన్ని విద్యా స్థాయిల్లో AI బోధించేందుకు సమగ్ర పాఠ్యాంశాలను రూపొందించిన మార్గదర్శక దేశాల్లో UAE ఒకటని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు.

UAE రూపొందించిన AI పాఠ్యాంశాన్ని, దాని వివిధ అంశాలను ఇతర దేశాల విద్యా మంత్రిత్వ శాఖలు, అంతర్జాతీయ విద్యా సమాజం కూడా ఉపయోగించుకునేలా అందుబాటులోకి తీసుకురావడానికి కేబినెట్ ఒక విధానాన్ని ఆమోదించింది.

“ఉపాధ్యాయులు జీవితాంతం నేర్చుకోవాలి”
వేగంగా మారుతున్న సాంకేతిక పరిణామాలు విద్యా బోధన విధానాలు, ప్రక్రియలు, సాధనాలను పూర్తిగా మార్చనున్నాయని షేక్ మహమ్మద్ అన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను నిరంతరం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

“మన పిల్లలకు ఈరోజు నిన్నటి పద్ధతులతోనే బోధిస్తే, వారి భవిష్యత్తును మనమే దూరం చేస్తున్నట్లవుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

AI ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగంలో కీలక మార్పులకు దారితీస్తున్న నేపథ్యంలో, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకునే విధంగా UAE తన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com