నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!

- September 03, 2026 , by Maagulf
నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!

కరోనా సంక్షోభ సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచి ‘రియల్ హీరో’ అనిపించుకున్న నటుడు, సేవా తత్పరుడు సోనూ సూద్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. పొరుగు దేశమైన నేపాల్‌ను అతలాకుతలం చేస్తున్న ఆకస్మిక వరద బాధితులను ఆదుకునేందుకు ఆయన నేరుగా రంగంలోకి దిగారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయి, లక్షలాది మంది నిరాశ్రయులైన వేళ.. నిత్యావసర సరుకులతో కూడిన సహాయ సామగ్రితో నేపాల్ రాజధాని ఖాట్మండు చేరుకుని బాధితులకు అండగా నిలిచారు.

ఖాట్మండులోని సహాయక శిబిరాల్లో చురుగ్గా పాల్గొంటూ, సర్వం కోల్పోయిన బాధితులకు ధైర్యం చెబుతున్నారు. ఇప్పటివరకు వరదల కారణంగా నేపాల్‌లో 1,000 మందికి పైగా మరణించినట్లు అంచనా. సహాయక శిబిరాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల దుస్థితి చూసి తన హృదయం ముక్కలైందని సోనూ సూద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తు ముందు మనమంతా నిస్సహాయులం అనిపించిందన్నారు. “8-9 ఏళ్ల క్రిస్టినా అనే చిన్నారి తన తమ్ముడితో ఉంటూ ‘అంతా సర్దుకుంటుంది’ అని చిరునవ్వుతో చెప్పిన మాటలు నన్ను తీవ్రంగా కదిలించాయి. ఆ పాపను దత్తత తీసుకోవాలనే ఆలోచన వచ్చినా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంత సహాయం చేయాలి” అని పేర్కొన్నారు. “ఇది కేవలం ప్రభుత్వాలు, మంత్రుల బాధ్యత అని అనుకోకూడదు. ఒక మనిషిగా, భారతీయుడిగా బాధితులకు విరాళాలు పంపి ఆదుకోవడం మనందరి కర్తవ్యం” అని పిలుపునిచ్చారు. ఇన్ స్టాగ్రామ్‌లో ఫోటో షేర్ చేస్తూ “వారు ఇళ్లను, బాల్యాన్ని కోల్పోయారు.. కానీ కలిసి కొత్త ఆరంభాన్ని ఇద్దాం. నేపాల్, మీరు ఒంటరి కాదు” అని భరోసా ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com