‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి'
- September 07, 2026
--ఎమెస్కో ప్రచురణగా రూపుదిద్దుకున్న అరుదైన శాసనసభా ప్రసంగాల సంకలనం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో శాసన సభా నిర్వహణలో తనదైన చెరగని ముద్ర వేసిన నాయకుడు, మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు శాసనసభా ప్రసంగాలు త్వరలోనే అక్షర రూపంలో మన ముందుకు రాబోతున్నాయి. సభా రికార్డుల్లో మైలురాయిగా నిలిచిపోయే ఈ ప్రతిష్టాత్మక గ్రంథాన్ని ప్రముఖ ప్రచురణ సంస్థ 'ఎమెస్కో' అత్యున్నత ప్రమాణాలతో ముద్రిస్తున్నది. "ప్రజల పక్షాన శ్రీపాద వాణి" పేరిట రూపొందిన ఈ అరుదైన ప్రసంగాల సంకలనాన్ని ఈ వర్షాకాలం శాసనసభ సమావేశాల సందర్భంగా ఆవిష్కరించేందుకు ఎమెస్కో సన్నహాలు చేస్తోంది.
6 మార్చ్1937లో దుద్దిళ్ల రాధాకృష్ణయ్య, కమలాభాయి దంపతులకు జన్మించిన శ్రీపాదరావు, బి.ఎస్సీ, ఎల్.ఎల్.బి పట్టా అందుకున్నారు. తన స్వగ్రామం ధన్వాడకు వరుసగా మూడుసార్లు ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికై... గ్రామ స్థాయి నుంచి తన ప్రజాసేవను ప్రారంభించారు. తర్వాత మంథని భూతనఖా బ్యాంక్ చైర్మన్గా, మహాదేవ్పూర్ సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేసి, 1983లో తొలిసారిగా మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం 1984, 1989లలో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ విప్గా, రీజనల్ టొబాకో బోర్డు సభ్యుడిగా, పలు అసెంబ్లీ కమిటీల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. 1991 ఆగష్టు 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికై 1995, జనవరి 11 వరకు ఆ పదవికి గౌరవాన్ని తెచ్చారు.
చట్టసభల్లో ఆయన వినిపించిన ప్రతి ఉద్వేగభరిత, విషయపరిజ్ఞానంతో కూడిన ప్రసంగం ‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి‘లో లభిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంత రైతాంగం ఎదుర్కొన్న సాగునీటి తిప్పలు, ఉత్తర తెలంగాణ కరువు మండలాల రోదనలు, దళిత బహుజన, నిరుపేద వర్గాల ఆవేదనను, నిరుద్యోగం, నక్సలైట్ సమస్యలను సభ ముందు ఉంచడంలో ఆయన చూపిన ధైర్యం, తెగువను ఈ సంకలనం కళ్ళకు కడుతుంది. రూల్ బుక్ను క్షుణ్ణంగా ఔపోసన పట్టిన మేధావిగా సభా నిబంధనలకు సంపూర్ణంగా కట్టుబడుతూనే, ఎంతటి బలమైన ప్రభుత్వాలనైనా నిలదీసిన తీరు, పాయింట్ ఆఫ్ ఆర్డర్లు, రూలింగ్లపై ఆయన వెలువరించిన చారిత్రాత్మక తీర్పులు నేటికీ అసెంబ్లీ రికార్డుల్లో ప్రామాణికంగా నిలిచాయి.
సతీమణి జయశ్రీ, నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలతో కూడిన కుటుంబంలో మంథనితో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చివరివరకు వీడని శ్రీపాదరావు, ఏప్రిల్ 13, 1999న 62వ ఏట నక్సలైట్ల చేతిలో హత్యకు గురయ్యారు. కానీ, "అర్ధరాత్రి తలుపు కొట్టినా స్పందించే నైజం" కలిగిన ప్రజానురంజక నాయకుడిగా, నిష్పాక్షిక స్పీకర్గా ప్రతిపక్షాల హక్కులకు అభయం ఇచ్చే రక్షణ కవచంలా ఇప్పటికీ ఆయన ప్రజల మనసులో నిలిచిపోయారు. చట్టసభల్లో చర్చల నాణ్యతపై ఆందోళన వ్యక్తమవుతున్న నేటి యుగంలో, మైకు దొరకగానే ఎంత గట్టిగా మాట్లాడామనే దానికంటే ఆ మాట వెనుక ఎంత విషయ పరిజ్ఞానం ఉండాలో నేర్పించేలా ఈ ‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి‘ ఒక 'కోర్సు బుక్' లా ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
శ్రీ పాదరావు తనయుడు డి.శ్రీదర్ బాబు ప్రస్తుతం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఆయన కూడా తండ్రిలాగే మృదుస్వభావంతో, విషయపరిజ్ఞానంతో ప్రజాసేవలో కొనసాగుతున్నారు.శ్రీపాద రావు ప్రసంగాలకు అక్షర రూపమిస్తూ ఎమెస్కో అందిస్తున్న ఈ ‘‘ప్రజల పక్షాన శ్రీపాద వాణి’’ వర్తమాన శాసనసభ్యులకు, భవిష్యత్ యువ నాయకులకు, ప్రజాస్వామ్యంపై పరిశోధనలు చేసే విద్యార్థులకు ఒక దిక్సూచిగా నిలవనుంది.
తాజా వార్తలు
- ఫాల్స్ రియల్ ఎస్టేట్ సమాచారం ఇస్తే SR50,000 వరకు ఫైన్..!!
- ‘అఫాక్’ పేమెంట్ సిస్టమ్ లో చేరిన ఖతార్ సెంట్రల్ బ్యాంక్..!!
- కువైట్ లో కేపిటల్ లో భద్రత మరింత పటిష్టం.. 257 అరెస్ట్..!!
- మెడికల్ సెంటర్ కు షాక్.. డాక్టర్కు BD4,072 చెల్లించాలని కోర్టు తీర్పు..!!
- ఒమన్ కుటుంబాల నెలవారీ ఆదాయం పెరుగుదల..!!
- దుబాయ్ లో 9 రోజుల స్కూల్ బ్రేక్.. అక్టోబర్ హాఫ్-టర్మ్ తేదీల్లో మార్పులు..!!
- వైరల్ గా మారిన H1N1 ఫ్లూ ! లైట్ తీసుకుంటే మీకే ప్రమాదం
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!







