పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు

- September 08, 2026 , by Maagulf
పోలీసుల విచారణలో యూట్యూబర్ నందన..నాకేం తెలియదు

హైదరాబాద్: వీసాల పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ నందన ఉదంతం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ కేసులో భాగంగా ఆమె మంగళవారం ఇబ్రహీంపట్నం పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

పోలీసుల విచారణకు నందన హాజరు
లుకౌట్ నోటీసుల ఆధారంగా శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న నందనకు పోలీసులు నోటీసులు అందించగా, ఆమె ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. అయితే పోలీసుల నుంచి ఎదురైన పలు కీలక ప్రశ్నలకు ఆమె నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో, ఈ నెల 16వ తేదీన మళ్లీ విచారణకు రావాలని పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.

వీసా వ్యాపారంతో నాకు సంబంధం లేదు: నందన వాదన
విచారణ సమయంలో నందన తన వాదనను గట్టిగా వినిపించారు. తాను కేవలం ఒక ఐటీ ఉద్యోగిని మరియు యూట్యూబర్‌ని మాత్రమేనని స్పష్టం చేశారు. వీసాల కన్సల్టెన్సీకి, దాని ఆర్థిక లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కంపెనీ వ్యవహారాలన్నీ తన భర్త మధుకరే చూసుకుంటారని, ఆ సంస్థలో తాను ఎటువంటి హోదాలోనూ లేనని ఆమె విచారణలో వెల్లడించారు.

భర్త మధుకర్‌పై పడుతున్న చట్టపరమైన ఉచ్చు
నందన తనపై ఉన్న ఆరోపణల బాధ్యతను పూర్తిగా భర్త మధుకర్‌పై నెట్టడంతో, ఇప్పుడు దర్యాప్తు అధికారుల దృష్టి ఆయనపై కేంద్రీకృతమైంది. బాధితుల ఫిర్యాదులో నందనతో పాటు ఆమె భర్త, మామగారి పేర్లు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న మధుకర్ చుట్టూ ఈ పరిణామాలతో చట్టపరమైన ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com