బ్రిక్స్‌ పై గ్లోబల్ సౌత్‌కు నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ

- September 13, 2026 , by Maagulf
బ్రిక్స్‌ పై గ్లోబల్ సౌత్‌కు నమ్మకం పెరిగింది: ప్రధాని మోదీ

న్యూ ఢిల్లీ:  బ్రిక్స్ కూటమి వేదికగా గ్లోబల్ సౌత్ దేశాల గొంతును బలంగా వినిపిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అందుకే ఆ దేశాల్లో బ్రిక్స్‌పై విశ్వాసం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. భిన్నత్వం, పరస్పర సహకారమే బ్రిక్స్ కూటమికి ప్రధాన బలమని ఆయన స్పష్టం చేశారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనలు, అనుభవాలకు బ్రిక్స్‌లో తగిన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

గ్లోబల్ సౌత్‌కు బ్రిక్స్‌పై విశ్వాసం

బ్రిక్స్‌పై గ్లోబల్ సౌత్ దేశాల నమ్మకం గతంతో పోలిస్తే మరింత పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. ఆయా దేశాల అభిప్రాయాలు, అనుభవాలకు ఈ వేదికపై గౌరవం లభిస్తోందని పేర్కొన్నారు. వారి సమస్యలకు పరిష్కారాలను కేవలం వారి కోసం రూపొందించడం కాకుండా, వారితో కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. వివిధ దేశాల మధ్య ఉన్న భిన్నత్వం, పరస్పర సహకారమే బ్రిక్స్ అసలైన బలమని మోదీ వ్యాఖ్యానించారు. ఈ వేదిక ద్వారా దేశాల మధ్య సహకారం మరింత బలపడటం ప్రపంచ పురోగతికి, మానవాళి సంక్షేమానికి ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అభివృద్ధి, పర్యావరణం రెండూ ముఖ్యం

అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత అవసరమని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. భారతీయ నాగరికతలో ప్రకృతికి తల్లి స్థానం ఇచ్చామని గుర్తుచేశారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పరస్పరం విరుద్ధమైన అంశాలు కాదని.. రెండూ ఒకదానికొకటి సహకరించే అంశాలని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మానవాభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని బ్రిక్స్ నిర్ణయించిందన్నారు.

స్వచ్ఛ ఇంధనం పై ప్రత్యేక దృష్టి

బ్రిక్స్ ఫ్రేమ్‌వర్క్‌లో చేపట్టిన పలు కార్యక్రమాలను కూడా మోదీ ప్రస్తావించారు. స్వచ్ఛ ఇంధన వ్యవస్థలను మరింత విశ్వసనీయంగా, సమర్థవంతంగా, అందరికీ అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. స్మార్ట్ గ్రిడ్లు, ఎనర్జీ స్టోరేజ్ వంటి రంగాల్లో సహకారం కోసం ‘బ్రిక్స్ డిజిటల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

సంప్రదాయ జ్ఞానం-ఆధునిక విజ్ఞానం కలయిక

వ్యవసాయం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, పర్యావరణ సుస్థిరత వంటి రంగాల్లో సంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. వ్యవసాయ పర్యావరణం, పునరుత్పాదక వ్యవసాయం కోసం ఏర్పాటు చేసిన సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సంప్రదాయ పరిజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో కలిపే ప్రయత్నం జరుగుతోందని తెలిపారు.

మానవాళి కోసం కలిసి ముందుకు సాగాలి

ప్రపంచంలోని దేశాలు, ప్రజలు విభిన్న పరిస్థితులు, వాస్తవికతలతో ముడిపడి ఉన్నప్పటికీ.. సహకారంతో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. తమ భిన్నత్వం గుర్తింపుగా, సహకారం స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. బ్రిక్స్ సాధించే పురోగతి కేవలం సభ్య దేశాలకే కాకుండా సమస్త మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా ఉండాలని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com