రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!

- September 19, 2026 , by Maagulf
రెండేళ్ల కష్టాలకు తెర.. ఇద్దరు పిల్లలతో స్వదేశానికి చేరుకున్న భారతీయ మహిళ..!!

మనామా: బహ్రెయిన్‌లో దాదాపు రెండేళ్లుగా కొనసాగిన న్యాయ, పత్రాల సమస్యలకు పరిష్కారం లభించడంతో భారతీయ మహిళ తన ఇద్దరు చిన్నారులతో కలిసి స్వదేశానికి తిరిగి వెళ్లారు. ప్రవాసి లీగల్ సెల్ (PLC) బహ్రెయిన్ చాప్టర్ సహకారంతో కుటుంబం స్వదేశానికి చేరుకుంది. అరుణిమ బేబీ కరీంబడం కునియిల్, ఆమె పిల్లలు గ్రీవా మరియం, జయాన్ మహమ్మద్ అవసరమైన జనన ధ్రువపత్రాలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కుటుంబానికి రెసిడెన్సీ, స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు అవసరమైన ప్రక్రియలు పూర్తిచేయడం కష్టంగా మారింది. ఆర్థిక, మానవతా సమస్యల మధ్య సహాయం కోరుతూ అరుణిమ మార్చి 2026లో ప్రవాసీ లీగల్ సెల్ (PLC)ను సంప్రదించారు.

PLC అధ్యక్షుడు సుధీర్ తిరునిలత్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ రిథిన్ రాజ్ సంబంధిత అధికారులతో సమన్వయం చేశారు. ఈ కేసును కోర్టులో ముందుకు తీసుకెళ్లేందుకు ప్యానెల్ న్యాయవాది అడ్వొకేట్ తారిఖ్ అలౌన్ను నియమించారు. కోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కీలకమైన న్యాయపరమైన అడ్డంకి తొలగిపోయింది. దీంతో కుటుంబం అవసరమైన పత్రాల ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం లభించింది.

BD597 బిల్లు.. 70 శాతం తగ్గింపు
కుటుంబానికి ఎదురైన మరో ఆర్థిక సమస్యను పరిష్కరించడంలో షిఫా అల్ జజీరా మెడికల్ సెంటర్ సహకరించింది. సుమారు BD597గా ఉన్న పెండింగ్ వైద్య బిల్లుపై 70 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో కుటుంబం చెల్లించాల్సిన మొత్తం సుమారు BD180కు తగ్గింది. ఈ ప్రక్రియలో భారత రాయబార కార్యాలయం, ఇమ్మిగ్రేషన్ అధికారులు, పలువురు వ్యక్తులు, కుటుంబం ఉంటున్న ఇంటి యజమాని కూడా సహాయం అందించారు.

సెప్టెంబర్ 17న అరుణిమ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎయిర్ ఇండియా విమానంలో బహ్రెయిన్ నుంచి కోచికి బయలుదేరారు. దీంతో దాదాపు రెండేళ్లుగా కొనసాగిన న్యాయ, పత్రాల సమస్యలకు ముగింపు పలికి కుటుంబం స్వదేశానికి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com