22వ కోల్‌కతా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ను ప్రారంభించిన అమితాబ్

- November 12, 2016 , by Maagulf
22వ కోల్‌కతా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ను ప్రారంభించిన అమితాబ్

'సినిమా ఫర్‌ ఆల్‌.. ఆల్‌ ఫర్‌ సినిమా..' అనే నినాదంతో 22వ కోల్‌కతా ఫిల్మ్‌ ఫెస్టివల్‌ శుక్రవారం సాయంత్రం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ నడుమ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. అమితాబ్‌ బచ్చన్‌, జయాబచ్చన్‌, షారూఖ్‌ఖాన్‌, సంజరుదత్‌, కాజోల్‌, పరిణీతి చోప్రా వంటి స్టార్స్‌ ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.
ఇదే వేడుకలో చైనాకు సంబంధించిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఆ దేశానికి చెందిన ఏడు చిత్రాలను ఈ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు.
13 దేశాలకు చెందిన 15 చిత్రాలను అంతర్జాతీయ పోటీలకు ఎంపిక చేశారు. ఈనెల 18 వరకు ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కొనసాగనుంది. సత్యజిత్‌ రే, రిత్విక్‌ ఘాటక్‌, మృణాల్‌సేన్‌ వంటి లెజెండ్స్‌ స్ఫూర్తితో ఈ చలన చిత్రోత్సవాన్ని 1995లో కోల్‌కతా చలన చిత్ర ఉత్సవ్‌ కమిటీ ప్రభుత్వ సహకారంతో ప్రారంభించింది. సామాన్యులను సైతం ప్రభావితం చేసే మంచి సినిమాల నిర్మాణం, వాటి ప్రోత్సాహంతోపాటు నూతన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయటమే లక్ష్యంగా ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కొనసాగుతోంది. గత చలన చిత్రోత్సవాలతో పోలిస్తే ఈసారి మహిళలకు పెద్ద పీట వేయటం విశేషం. తాజాగా ప్రారంభమైన 22వ కోల్‌కతా ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇంటర్నేషనల్‌ కాంపిటీషన్‌ విభాగంగా మహిళా దర్శకులు రూపొందించిన 16 చిత్రాలు పోటీలో ఉండగా, ఇన్నోవేషన్స్‌ ఇన్‌ మూవీంగ్‌ ఇమేజెస్‌ అంతర్జాతీయ విభాగంగా 8 సినిమాలు పోటీ పడుతున్నాయి. అలాగే రీజినల్‌ ఫోకస్‌లో మరాఠి సినిమాలు, నేషనల్‌ కాంపిటీషన్‌లో లఘు చిత్రాలు, అలాగే నేషనల్‌ కాంపిటీషన్‌లోనే డాక్యుమెంటరీ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఉత్తమ చిత్రాలు, ఉత్తమ దర్శకులు, ఉత్తమ లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలుగా ఎంపికైన వాటికి ద రాయల్‌ బెంగాల్‌ ట్రోఫీని అందజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com