సమస్యల పరిష్కారం జస్ట్‌ ఓ క్లిక్‌తో

- January 15, 2017 , by Maagulf
సమస్యల పరిష్కారం జస్ట్‌ ఓ క్లిక్‌తో

మనామా: భారతీయ వలసదారులు ఇండియన్‌ ఎంబసీ సహాయం కోరడం ఇకపై చాలా సులువు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, వ్యక్తిగతంగా ట్విట్టర్‌ ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వికె సింగ్‌, బహ్రెయిన్‌ అధికారిక పర్యటనలో భారతీయ వలసదారుల్ని ఉద్దేశించి ఓ ప్రకటన చేశారు. ఇండియన్‌ ఎంబసీ లేదా అథారిటీకి తమ సమస్యల్ని ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చనీ, అలాగే ఆ ఫిర్యాదుని తన ట్విట్టర్‌ అకౌంట్‌కి కూడా పంపవచ్చనీ, తద్వారా ఆ ఫిర్యాదుల్ని తాము పరిశీలిస్తామని కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ఇంకో వైపున, ఎంబసీ పూర్తిస్థాయిలో భారతీయ వలసదారుల సమస్యలను పరిష్కరించడానికి సర్వసన్నద్ధంగా ఉందని వికె సింగ్‌ చెప్పారు. గడచిన రెండున్నరేళ్ళలో విదేశీ వ్యవహారాల శాఖ, విదేశాల్లో సమస్యలతో సతమతమవుతున్న భారతీయుల పట్ల మరింత సమర్థవంతంగా పనిచేస్తోందని ఆయన వివరించారు. ఇప్పటికే సుష్మాస్వరాజ్‌ కొందరు భారతీయ వలసదారుల సమస్యల పట్ల వ్యక్తిగతంగా స్పందించారు. అలాగే వికె సింగ్‌ కూడా తనదైన చొరవ ప్రదర్శిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా తమ సమస్యలు పరిష్కారమవుతున్నందుకు బాధితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం చెబుతోంది. ఇదిలా ఉండగా, భారతీయుల నరనరాల్లోనూ కష్టించే తత్వం జీర్ణించుకుపోయిందనీ, అందుకే వారు ఏ దేశానికి వెళ్ళినా అక్కడి అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్నారనీ, అయితే కొన్ని సమస్యల కారణంగా వారు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, ఆ సమస్యల్ని పరిష్కరించడమే తమ లక్ష్యమని వికె సింగ్‌ చెప్పారు. భారతదేశ అభివృద్ధిలోనూ ఎన్‌ఆర్‌ఐలు కీలక భూమిక పోషిస్తున్నట్లు చెప్పారాయన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com