ఏపీఎన్‌ఆర్‌టీ చేయూత కువైట్‌లో బాధిత మహిళకు

- March 18, 2017 , by Maagulf
ఏపీఎన్‌ఆర్‌టీ చేయూత కువైట్‌లో బాధిత మహిళకు

అనారోగ్యంతో కువైట్‌లోని ఓ ఆస్పత్రిలో మగ్గుతున్న ఆంధ్రా మహిళకు ఏపీ ఎన్‌ఆర్‌టీ అండగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. తన భర్త పట్టించుకోకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా అత్తిలికి చెందిన సుజనా తులసి బతుకుదెరువు కోసం కువైట్‌ వచ్చి ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఆ ఇంట్లో ఆమెను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో భరించలేక పారిపోయి కువైట్‌లోని ఫర్వానియాలో ఓ చిన్న గది అద్దెకు తీసుకుంది. తనకు వచ్చిన టైలరింగ్‌ పనితో జీవనం సాగించేంది. ఓ రోజు ఫర్వానియా నుంచి ఖైతాన్‌ వెళ్లేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొనడంతో కాలు, చేయి, నడుము భాగాల్లో ఫ్యాక్చర్‌ అయింది. నడవలేని స్థితిలో ఉన్న ఆమెను సురేష్‌ అనే ఫాస్టర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఐదు నెలలపాటు ఆమెను కేరళకు చెందిన షైనీ అనే మహిళ అన్ని విధాలా సపర్యలు చేస్తూ భారత్‌కు పంపేందుకు అవసరమైన పత్రాలను సిద్ధం చేయించారు. బాధితురాలు సుజానాపై 800 కువైట్‌ దినార్లు తీసుకుని పారిపోయిందనే కేసు ఉండటంతో అక్కడి నుంచి రావడానికి ఆటంకం ఏర్పడింది.
ఈ సమస్యని షైనీ కువైట్‌ ఆంధ్ర టీంకు తెలపడంతో వారు ఏపీ ఎన్‌ఆర్‌టీ కోఆర్డినేటర్‌ కుదరవల్లి సుధాకరరావు ద్వారా ఏపీఎన్‌ఆర్‌టీ సీఈవో వేమూరి రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన బాధితురాలిని భారత్‌కు పంపేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. భారత్‌లో ఆమె బతుకుదెరువు కోసం ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ఎన్టీఆర్‌ ఆరోగ్యసేవా పథకాల ద్వారా తగిన సహాయం అందించేందుకు కృషిచేస్తున్నట్లు ఏపీఎన్‌ఆర్‌టీ ఓ ప్రకటనలో తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com