బాక్సైట్ విషయంలో వైఎస్ తప్పు

- December 11, 2015 , by Maagulf
బాక్సైట్ విషయంలో వైఎస్ తప్పు

అధికార పీఠం కోసం నిరంతరం కలలు కనే ఏపీ ప్రతిపక్షనేత జగన్ ఇప్పుడు తన పోరును మరింత ఉధృతం చేశాడు. ఏ చిన్న అవకాశం వచ్చినా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. మొన్నటికి మొన్న కల్తీ సారా తాగి విజయవాడలో ఏడుగురు వరకూ చనిపోయిన ఘటనను రాజకీయ అస్త్రంగా మలచుకున్నాడు. తాను అధికారంలోకి వస్తే ఏకంగా మద్య నిషేధం అమలు చేస్తానని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బాక్సైట్ అంశంపైనా జగన్ పోరు ఉధృతం చేశాడు. విశాఖ జిల్లాకు వెళ్లి నిరసన సభ నిర్వహించాడు. తాము ఉన్నంతవరకూ బాక్సైట్ గనులపై ఎవరూ చేయి వేయలేరని గిరిజనులకు భరోసా ఇచ్చారు. ఐతే.. ఇక్కడో చిన్న లాజిక్ ఉంది. అసలు ఈ బాక్సైట్ గనుల ఇష్యూను బయటకు తెచ్చిందే వైఎస్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన హయాంలోనే బాక్సైట్ గనుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వాలన్నఆలోచన మొదలైంది. టీడీపీ కూడా ఇదే ఇష్యూను హైలెట్ చేస్తోంది. దీంతో మాకేం సంబంధం లేదు. మీ తండ్రే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ జగన్ పై ఎదురుదాడికి దిగారు. నిజానికి వైఎస్ బాక్సైట్ అంశాన్ని వెలుగులోకి తెచ్చినా.. గనుల అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. ఆ తర్వాత ఎలాగూ ప్రభుత్వం మారింద. గత ప్రభుత్వాల అసంబద్ధనిర్ణయాలను రద్దు చేసే హక్కు ప్రస్తుత ప్రభుత్వానికి ఉంది. టీడీపీ నేతలు ఆ పని చేయకుండా.. ఊ అంటే చాలు వైఎస్ హయాంలోనే ఈ గొడవ మొదలైందని కలరింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఓ సంచలన ప్రకటన చేశాడు. బాక్సైట్ విషయంలో ఎవరూ చేసినా తప్పు తప్పేనని తేల్చేశాడు. ఆ తప్పు చేసింది వైఎస్ రాజశేఖరెడ్డి అయినా, జగన్ అయినా చంద్రబాబు అయినా తప్పు తప్పే అన్నాడు జగన్. బాక్సైట్ విషయంలో రాజశేఖర్ రెడ్డి ప్రక్రియ ప్రారంభించి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత దాన్ని వైఎస్ ఆపేశారని.. ఇప్పుడు దాన్ని బయటకు తీసుకొచ్చింది టీడీపీ వారు కాదా అని జగన్ నిలదీశారు. మొత్తానికి బాక్సైట్ విషయంలో వైఎస్ తప్పు చేశారని జగన్ అంగీకరించారన్నమాట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com