అరకులో నేటి నుండి బెలూన్‌ ఫెస్టివల్‌

- January 18, 2019 , by Maagulf
అరకులో నేటి నుండి బెలూన్‌ ఫెస్టివల్‌

విశాఖ : ఆంధ్రా కాశ్మీర్‌గా పేరు గాంచిన అరకులో నేటి నుండి మూడు రోజులు బెలూన్‌ ఫెస్టివల్‌ జరుగనుంది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహిస్తుండగా.. దీనిలో భాగంగా అరకు ఏజెన్సీలో మూడు రోజుల పాటు బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహిస్తోంది. అరకు మండలం భల్లు గుడ, దళపతి గుడ సమీపంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గనేందుకు అంతర్జాతీయంగా పేరొందిన 15 దేశాలకు చెందిన పైలట్లు (బెలూన్లు నడిపేవారు) 20 బెలూన్లతో ఇప్పటికే అరకు చేరుకున్నారు. వీరితో పాటు అతిథుల మర్యాద కోసం తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. బెలూన్లలో షికార్‌ చేసేందుకు ఆన్‌ల్కెన్‌లో 4 వేల మంది నమోదు చేసుకున్నారు. బెలూన్లు 5 వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే అవకాశం ఉన్నప్పటికీ ఎయిర్‌ ట్రాఫిక్‌ నిబంధనల కారణంగా 2,500 అడుగుల ఎత్తున విహరించవచ్చు. దీంతో ఏజెన్సీ అందాలను ఆకాశం నుండే ఉచితంగా వీక్షించవచ్చు. ఒక్కో బెలూన్‌ గంటపాటు ఆకాశయానం చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇందులో ఒకసారి ఐదుగురు వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు ఉంది.

ఈ విధంగా రోజుకి 70 మంది ఆకాశం నుంచి అరకు ఏజెన్సీ అందాలు చూసే అవకాశం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నందున లాటరీ తీసి మొత్తం 210 మందికి ఆకాశయానం చేసే అవకాశం కల్పిస్తామని టూరిజయం శాఖ అధికారులు తెలిపారు. గత ఏడాది బెలూన్‌ ఫెస్టివల్‌ నిర్వహించినప్పటికీ వాతావరణం అనుకూలించక పోవడంతో రద్దయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com