నౌకను అడ్డుకున్నారో ఖబడ్డార్‌ !..అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

- August 22, 2019 , by Maagulf
నౌకను అడ్డుకున్నారో ఖబడ్డార్‌ !..అమెరికాకు ఇరాన్‌ హెచ్చరిక

టెహ్రాన్‌: తమ దేశానికి చెందిన చమురు రవాణా నౌకను స్వాధీనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలపై ఇరాన్‌ అమెరికాను ఘాటుగా హెచ్చరించింది. దాదాపు ఆరువారాల దిగ్బంధం అనంతరం ఈ నౌక సోమవారం జిబ్రాల్టర్‌ రేవు నుండి బయల్దేరిన విషయం తెలిసిందే. ఈ నౌకను అప్పగించాలంటూ అమెరికా జిబ్రాల్టర్‌ అధికారులపై వత్తిడి తెస్తున్న నేపథ్యంలో ఈ ప్రయత్నాలను విరమించుకోవాలని తాము హెచ్చరించినట్లు ఇరాన్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఐరోపా కూటమి విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా సిరియాకు చమురు సరఫరా చేస్తోందన్న అనుమానంతో అమెరికా మిత్ర దేశం బ్రిటన్‌కు చెందిన రాయల్‌ మెరైన్స్‌ ఈ అద్రన్‌ దర్యా (గ్రేస్‌-1) నౌకను జులై నాలుగున జిబ్రాలర్‌ రేవులో దిగ్బంధించిన విషయం తెలిసిందే. రెండు వారాల తరువాత ఇందుకు ప్రతీకార చర్యగా బ్రిటన్‌కు చెందిన ఒక నౌకను హోర్ముజ్‌ జలసంధి ప్రాంతంలో ఇరాన్‌ దళాలు దిగ్బంధం చేశాయి. ఈ నౌక దిగ్బందాన్ని విరమించుకోవాలని జిబ్రాల్టర్‌ నగరానికి చెందిన ఒక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తాము ఉగ్రవాద దేశాల జాబితాలో చేర్చిన సిరియాకు చమురు సరఫరా చేస్తున్న ఈ నౌకను నిర్బంధంలోనే వుంచాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని జిబ్రాల్టర్‌ ప్రభుత్వం త్రోసిపుచ్చుతూ ఈ ఆంక్షలు ఐరోపాలో చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. దీనితో కోర్టు ఆదేశాల మేరకు గ్రేస్‌-1 నౌక ఆదివారం సాయంత్రం జిబ్రాల్టర్‌ నుండి గ్రీస్‌లోని కలమట రేవుకు బయల్దేరినట్లు అధికారులు చెప్పారు. తమ నౌకను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్‌ ప్రభుత్వం తమ దేశంలోని స్విస్‌ రాయబార కార్యాలయం ద్వారా ట్రంప్‌ సర్కార్‌ను తీవ్రంగా హెచ్చరించినట్లు తెలిపింది. 'మరోసారి ఇటువంటి తప్పు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వుంటుంద'ని అమెరికా అధికారులను తాము హెచ్చరించినట్లు ఇరాన్‌ విదేశాంగ ప్రతినిధి అబ్బాస్‌ మొసావీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com