యువతకు చైతన్య దీప్తి వివేకానంద 153 వ జయంతి…...

- January 11, 2016 , by Maagulf
యువతకు చైతన్య దీప్తి వివేకానంద  153 వ జయంతి…...

శక్తి అంతా మనలోనే ఉంది. ఎక్కడినుంచో ఏదో రాదు. మనకు మనమే నిర్మాతలం. మీ గమ్యాన్ని చేరుకోవాలంటే మీరే నడవాలి. వేరెవరో వచ్చి మిమ్మల్ని నడిపించరు. ప్రపంచంలో ఒక్కొక్కరికీ ఒక్కో వ్యక్తి ప్రేరణ అయితే... ప్రపంచంలోని అందరికీ ప్రేరణనిచ్చే వారు స్వామి వివేకానంద. జనవరి 12, 1863న కలకత్తాలో ఓ ఉన్నత కుటుంబంలో జన్మించిన వివేకానందునికి తల్లిదండ్రులు పెట్టిన పేరు నరేంద్రనాథ్‌ దత్తా. 

        భారత్‌ గురించి తెలుసుకోవాలంటే వివేకానందుడ్ని చదివితే చాలు. ఈనాడు భారత్‌ ఓ దేశంగా ఉందంటే... దానికి కారణం వివేకానందుడే. ఆయన చేసిన బోధనల వల్ల ప్రభావితులైన చాలామందిలో సుభాష్‌ చంద్రబోస్‌, గాంధీ, నెహ్రూ, సర్వేపల్లిలతో పాట ఎందరో ఉన్నారు. 1984లో. స్వామి వివేకానంద పుట్టినరోజుని భారత ప్రభుత్వం ‘యువకుల దినోత్సవం’గా ప్రకటించింది. ఫలితంగా ఇవాళ యావత్ దేవం యూత్ డే ని జరుపుకుంటుంది. ఆ మహనీయుని 153 వ జయంతిని పురస్కరించుకుని వివేకానందుని విలువైన జీవిత చరిత్ర, ఆయన సమాజానికి అందించిన స్ఫూర్తి, భోదనలను మరోసారి మననం చేసుకుందాం
       కన్నతల్లి ఒడిలోనే వేదాలు, పురాణాలలో ఉన్న నీతిని నేర్చుకున్నాడు వివేకానందుడు. జీవించింది చాలా తక్కువ సంవత్సరాలే (39 సంవత్సరాలు) యువతకు, సమాజ శ్రే యస్సుకు కావాల్సినంత స్ఫూర్తిని అందించా డు. రామకృష్ణ పరమహంస శిష్యునిగా మం చి పేరు సంపాదించుకోవడమే కాకుండా గు రుశిష్యుల బంధానికి ఒక ప్రతీకగా నిలిచాడు ఆయన. స్వామి వాక్పటిమకు, అనంతమైన మేధాసంపత్తికి చికాగో ప్రసంగంలో శ్రోతలు ముగ్దులయ్యారు. చికాగో నగర వీధులలో వివేకానందుని నిలువెత్తు చిత్రపటాలు వెలిశాయి. ఆయన మహోపన్యాసం హిందూ ఝంఝామారుతమని, ఆయన ఈశ్వర ప్రేరిత ప్రవక్త అని పత్రికలు శ్లాఘించాయి. నాలుగు సంవత్సరాల పాటు అమెరికా, ఐరోపా ఖండాల్లో పర్యటించి, అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చి, వేదాంత కేంద్రాలు నెలకొల్పి, అనేకులను శిష్యులుగా స్వీకరించి 1897లో స్వదేశానికి తిరగి వచ్చారు. దీనితో భారత దేశంలో నూతన శకం ప్రారంభమైంది. వెనువెంటనే స్వామి వివేకానంద ‘రామకృష్ణ మిషన్‌’ స్థాపించాడు.        
యువతకు స్ఫూర్తి మంత్రాలు
* ధీరులూ, సమర్థులైన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది. దిగంతాలను తాకే వీరోచితమైన ధైర్యోత్సాహాలతో ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారే అద్భుతాలను సుసాధ్యం చేయగలరు.
* తనపై తనకు నమ్మకం లేనివాడే అసలైన నాస్తికుడు.
* భారతదేశంలో ముగ్గురు వ్యక్తులు కలిసికట్టుగా ఐదు నిమిషాలైనా పనిచేయరు. ప్రతి ఒక్కరు అధికారం కోసమే అర్రులు చాస్తారు. చివరికి మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది.
* మీ భవితకు మీరే విధాతలని గుర్తించండి.
* సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్థులని భావించకండి. మీరు ఏమైనా చేయగలరు. అన్నింటినీ సాధించగలరు.* పరాజయాలను పట్టించుకోకండి. అవి సర్వసాధారణం. అవే జీవితానికి మెరుగులు దిద్దేవి. ఓటములే లేని జీవితం ఉంటుందా?
* బలమే జీవనం. భయమే మరణం.
* ఎదుగుదలను నిరోధించే ప్రతికూల పరిస్థితుల మధ్యలో వికసించి, పెంపొందడమే జీవితం.
* మీరు పవిత్రులుగా ఉండగలిగితే, ప్రపంచమంతా కూడా మీకు పవిత్రంగా కనబడి తీరుతుంది.
* విధేయత, సంసిద్ధత మరియు పనిమీద శ్రద్ధాభక్తులు మీలో ఉంటే, మిమ్మల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు.* గమ్యం తెలియక, నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది. నిగ్రహంతో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి, విజయ శిఖరాలను అధిరోహింపజేస్తుంది.
* మనకు కావలసినవి మూడు - ప్రేమించే హృదయం, భావించే మనసు, పనిచేసే చెయ్యి.
* నిరాశ, నిస్ఫృహలనేవి లేకుండా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమనేది భగవంతుని సాన్నిధ్యం చేరడానికి దోహదపడుతుంది.
* అసత్యమైనదానికి దూరంగా ఉండండి. సత్యాన్నే అంటిపెట్టుకుని ఉంటే విజయం సాధించగలం. ఆలస్యమైనప్పటికీ విజయం సాధించే తీరుతాం.
* లే! లేచి నిలబడు. ధైర్యంగా ఉండు. నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవు. నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి.
* సర్వశక్తీ నీలోనే ఉంది. నువ్వు తలుచుకుంటే ఈ సమస్త లోకమూ నీ పాదాక్రాంతమవగలదు. శక్తిమంత మైనది ఆత్మే కాని, జడ పదార్థం కాదు.
* విధేయతను కలిగివుండి , సేవకుడిగా ఉండటం అలవర్చుకుంటే, నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది.
- స్వామి వివేకానంద -

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com