ఐటీ వలలో టాలీవుడ్

- November 20, 2019 , by Maagulf
ఐటీ వలలో టాలీవుడ్

టాలీవుడ్‌కు చెందిన బడా బడా వ్యక్తులు టార్గెట్‌గా ఐటీ పంజా విసిరింది. ఈ రోజు ఉదయం ముందుగా అగ్ర నిర్మాత సురేష్‌బాబును టార్గెట్ చేసిన ఐటీ రామానాయుడు స్టూడియోతో పాటు, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయాల్లో కంటిన్యూగా సోదాలు చేస్తోంది. ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి ఈ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. ఆ వెంటనే ఐటీ అధికారులు నేచురల్ స్టార్ నానిని కూడా టార్గెట్ చేశారు. నాని ఇంటితో పాటు ఆయన సన్నిహితుల ఇళ్లలోనూ ఏకకాలంలో దాడులు కొనసాగిస్తున్నారు.

కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో పలువురు స్టార్ నిర్మాతలు, బడా ప్రొడ్యుసర్లు టార్గెట్‌గా వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు ఒకేసారి అటు నిర్మాత సురేష్‌బాబుతో పాటు హీరో నాని ఇళ్లపై దాడులు చేయడంతో టాలీవుడ్ అంతా ఉలిక్కి పడుతోంది. ఇక మరో స్టార్ హీరో మహేష్‌బాబుతో పాటు యంగ్ హీరో శర్వానంద్ ఇళ్లపై సైతం ఐటీ దాడులు జరుగుతాయని కూడా తెలుస్తోంది.

ఇక కేటీఆర్‌కు సన్నిహితంగా ఉంటోన్న మరో సీనియర్ హీరో నాగార్జున ఇంటితో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై సైతం ఐటీ అధికారులు దాడులు చేసే అవకాశం ఉందని అంటున్నారు. గత నెల రోజుల నుంచి ఐటీ పంజా టాలీవుడ్‌పై పడుతోంది. కేఎల్‌.నారాయణతో పాటు ప్రముఖ సినీ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. సంస్థ అధినేతలు నారయణదాస్‌, సునీల్‌ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలతో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com