ఏపీ: 24 మంది మంత్రుల రాజీనామాను ఆమోదించిన గవర్నర్

- April 10, 2022 , by Maagulf
ఏపీ: 24 మంది మంత్రుల రాజీనామాను ఆమోదించిన గవర్నర్

అమరావతి: ఏపీ కొత్త మంత్రివర్గం లో భాగంగా ప్రస్తుతం ఉన్న 24 మంత్రులు రాజీమానా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామా పత్రాలు శనివారం గవర్నర్ కు చేరుకోగా..నేడు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. అయితే రాజీనామాల ఆమోదంపై మధ్యాహ్నానికి అధికారిక ప్రకటన వెలువడనుంది. దీంతో పాటు కొత్త మంత్రుల జాబితా తన వద్దకు రాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలపనున్నారు.మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణపై మూడు నాలుగు రోజుల నుంచి సీఎం కసరత్తు చేస్తున్నారు.శుక్ర, శనివారాలు రెండు రోజులూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని పిలిపించుకుని చర్చించారు. ఆదివారం ఉదయం కూడా జాబితాపై కసరత్తు జరిగింది.

కసరత్తులో భాగంగా కొత్త మంత్రుల పేర్లతో పాటు, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే విషయంపైనా సీఎం ఒక ప్రణాళికను సిద్ధం చేసినట్లు సమాచారం. మంత్రి పదవులు కోల్పోయినవారికి గౌరవం తగ్గకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఎలా చేయాలనే దానిపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీబీ) ఏర్పాటు, వాటి బాధ్యతలను మాజీ మంత్రులకు అప్పగించడం, వారికి ప్రోటోకాల్‌, అందులో న్యాయపరమైన ఆటంకాలు రాకుండా ఎలా చేయాలనే అంశాలపై విస్తృత చర్చ జరిగినట్లు సమాచారం.

మంత్రివర్గం విస్తరణలో పాత 10 మంది మంత్రులు కొనసాగనున్నారు. అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం అవసరాలే ప్రాతిపదికన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్ర నాథ్, కొడాలి నాని, గుమ్మనూరు జయరాం, సిదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, పేర్ని నాని లు కొనసాగనున్నట్లు సమాచారం.రేపు వెలగపూడి సచివాలయ భవన సముదాయం పక్కనున్న పార్కింగ్‌ స్థలంలో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కార్యక్రమాన్ని 11:31 గంటల నుంచి నిర్వహించనున్నారు. అది ముగిశాక.. ముఖ్యమంత్రి గవర్నర్‌తో కలిసి కొత్త మంత్రులతో తేనేటి విందులో పాల్గొనడంతోపాటు గ్రూప్‌ ఫొటో తీయించుకుంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com