దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం

- June 13, 2026 , by Maagulf
దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం

దుబాయ్: ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు వలస కార్మికుల మృతదేహాలను త్వరితగతిన వారి స్వస్థలాలకు తరలించేలా చర్యలు చేపట్టాలని చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం దుబాయ్‌లోని ప్రముఖ బుర్జీల్ ఆసుపత్రి ప్రతినిధులను కోరారు.

దుబాయ్ పర్యటనలో భాగంగా శుక్రవారం బుర్జీల్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే, ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పరిశీలించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రమాద బాధితులకు అందిస్తున్న సహాయ సహకారాలపై ఆసుపత్రి ప్రతినిధులతో చర్చించారు.

ప్రమాదంలో మృతి చెందిన ఐదుగురు బాధితుల కుటుంబాలకు, గాయపడిన తొమ్మిది మంది క్షతగాత్రులకు మానవతా దృక్పథంతో భారీ ఆర్థిక సహాయం ప్రకటించిన బుర్జీల్ హోల్డింగ్స్ చైర్మన్ డా. షంషీర్ వయలిల్ సేవలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఈ సహాయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.

డా. షంషీర్ వయలిల్ అందుబాటులో లేకపోవడంతో ఆయన సంస్థ ప్రతినిధులైన విజయ్‌కుమార్, అహ్మద్ బిన్ సులేమాన్, ఉస్నిక్కట్టిడ్, డా. పంకజ్ కుమార్ భట్లను కలిసి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే బుర్జీల్ ప్రతినిధులను హైదరాబాద్‌కు ఆహ్వానిస్తూ, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయ చెక్కులు అందజేసే కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యుడు సత్యం గౌడ్, తెలంగాణకు చెందిన సామాజిక కార్యకర్తలు శ్రీనివాస్ రావు, షామ్యూల్, సలావుద్దీన్, ఎస్‌వీ రెడ్డి, మహిపాల్ యాదవ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

కాగా, దుబాయ్‌లో ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం పర్యటనను సామాజిక కార్యకర్తలు నర్సింహులు, సత్యనారాయణ, భీంరెడ్డి, దేవేందర్ రెడ్డి సమన్వయం చేశారు. ప్రమాద బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా, అవసరమైన సహాయం అందేలా చర్యలు కొనసాగుతాయని ఎమ్మెల్యే తెలిపారు.

--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com