చంద్రబాబు పై కేసు నమోదు చేసి పోలీసులు..
- February 18, 2023
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. డీఎస్పీ భక్తవత్సలం ఫిర్యాదుతో చంద్రబాబు సహా ఏడుగురు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్లు 143, 353, 149, 188 కింద కేసు బుక్ చేశారు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్ షో నిర్వహించడమే కాకుండా డ్యూటీలో ఉన్న పోలీసులను దూషించారని డీఎస్పీ చేసిన ఫిర్యాదుతో చంద్రబాబుపై కేసు నమోదైంది.
చంద్రబాబు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటన సందర్భంగా నిన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు రోడ్ షోకి అనుమతి లేదంటూ పోలీసులు బలభద్రపురం దగ్గర అడ్డుకున్నారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీసులు రోడ్డుపై బైఠాయించారు. దాంతో చంద్రబాబు వాహనం దిగి కాలినడకన 7 కిలోమీటర్లు ప్రయాణించి అనపర్తి చేరుకున్నారు. అక్కడ కూడా పోలీసులు తన మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారంటూ చంద్రబాబు మండిపడ్డారు.
శుక్రవారం అనపర్తిలో చంద్రబాబు రోడ్షో, బహిరంగ సభకు పోలీసులు సడెన్ గా అనుమతి రద్దు చేశారు. పోలీసుల తీరుపై చంద్రబాబు, టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం జరిగింది. తీవ్ర ఉద్రిక్తతల నడుమ చంద్రబాబు టూర్ సాగింది.
అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధించి చంద్రబాబును, టీడీపీ నాయకులను, కార్యకర్తలను అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను టీడీపీ కార్యకర్తలు తోసుకుంటూ ముందుకు వెళ్లారు. చంద్రబాబు కాన్వాయ్ కి అడ్డంగా పోలీస్ వ్యాన్ పెట్టారు. కాన్వాయ్ ముందుకెళ్లే దారి లేకుండా పోయింది.
దీంతో చంద్రబాబు తన కాన్వాయ్ దిగి కాలినడకన వెళ్లారు. పోలీసుల ఆంక్షల మధ్య చంద్రబాబు 7 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. చంద్రబాబు పాదయాత్రగా వెళ్తున్న సమయంలో అడుగడుగునా పోలీసులు అడ్డుతగలడంతో పాటు చంద్రబాబు ప్రసంగించిన వాహనాన్ని ముందుకు కదలనీయకపోవడంతో మరో వాహనంపై నుంచి ప్రసంగించారు. పోలీసుల తీరుపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. డీఎస్పీని ఉద్దేశించి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబుపై డీఎస్పీ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది.
శుక్రవారం అనపర్తిలో పోలీసులతో తోపులాటలో గాయపడిన పార్టీ కార్యకర్తలను చంద్రబాబు పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అక్రమంగా నమోదు చేసిన కేసులపై న్యాయబద్ధంగా పోరాడదామని వారికి పిలుపునిచ్చారు చంద్రబాబు. ప్రజల్లో వ్యతిరేకతను గమనించిన వైసీపీ ప్రభుత్వం.. అరాచకాలకు పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. అనపర్తిలో పోలీసులను పురిగొల్పి పంపారని ఆరోపించారు. సభ నిర్వహణకు ముందురోజు అనుమతి ఇచ్చారని, కానీ అప్పటికప్పుడు అనుమతి లేదంటూ అరాచకం సృష్టించారని నిప్పులు చెరిగారు.
జగ్గంపేట, పెద్దాపురంలో లేని ఆంక్షలు అనపర్తిలో ఎందుకు వచ్చాయని చంద్రబాబు ప్రశ్నించారు. ప్రతిపక్షాల సభలను అడ్డుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందన్నారు. చట్టవ్యతిరేకంగా పని చేయాలని పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!
- అమెరికా అధ్యక్షుడితో అమీర్ సమావేశం..!!
- యూఏఈలో 6నెలల్లో 6 మిలియన్ల VPN యాప్స్ డౌన్లోడ్..!!
- వారంలో 14,039 మందిని బహిష్కరించిన సౌదీ..!!
- చిరంజీవితో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు భేటీ
- సజ్జనార్ పేరుతో సైబర్ మోసాలు
- బస్సు ప్రమాదం..భారీగా తగ్గిన ప్రైవేట్ టికెట్ ధరలు
- గ్లోబల్ విలేజ్లో ఆహార నాణ్యతపై తనిఖీలు..!!







