ఎయిరిండియా‍ విమానంలో అధికారి పై దాడి...

- July 16, 2023 , by Maagulf
ఎయిరిండియా‍ విమానంలో అధికారి పై దాడి...

న్యూ ఢిల్లీ: దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా‍లో...... మరో ప్రయాణికుడు అనుచితంగా ప్రవర్తించాడు. సిడ్నీ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు ఓ ప్రయాణికుడు రెచ్చిపోయాడు. మెల్లగా మాట్లాడన్నమందుకే ఓ సీనియర్ అధికారి పై చేయి చేసుకున్నాడు. తోటి ప్రయాణికులతో పాటు సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. గట్టిగా అరుస్తూ దుర్భాషలాడాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. అతడిని దిల్లీలో భద్రతా సిబ్బందికి అప్పజెప్పారు. ఆ తర్వాత అతడు తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాడు. ఈ ఘటన జులై 9న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సిడ్నీ నుంచి ఢిల్లీ వస్తున్న ఓ విమానంలో ఎయిరిండియా సీనియర్ అధికారికి, తోటి ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం జరిగింది. సీట్‌ విషయంలో ఇబ్బంది తలెత్తడం వల్ల బిజినెస్ క్లాస్ నుంచి ఎకానమీకి క్లాస్‌కు వచ్చి ఆ అధికారి కూర్చున్నాడు. తన పక్కనే ఉన్న ఓ వ్యక్తి బిగ్గరగా మాట్లాడుతుండటం వల్ల అతడికి సర్దిచెప్పేందుకు యత్నించాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తి.. అధికారి పై చేయి చేసుకున్నాడు. మెడపట్టుకుని విరిచే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ పెద్దదైంది. ఆ సమయంలో అత్యవసర సమయాల్లో ప్రమాదాల నుంచి బయట పడేందుకు ఉపయోగించే ఎక్విప్‌మెంట్స్‌ ఉన్న రూమ్‌లో చొరబడడంతో కలకలం రేగింది. అక్కడే ఉన్న సిబ్బంది అప్రమత్తమై విషయాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నించగా.. సదరు వ్యక్తి ఆ అధికారితో పాటు సిబ్బందిపైకి విరుచుకుపడ్డాడు. గట్టిగా అరుస్తూ దుర్భాషలాడాడు. దీంతో కాసేపు అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

తోటి ప్రయాణికులు సైతం ఈ ఘటన వల్ల ఇబ్బందికి గురయ్యారు. ఐదుగురు యువ క్యాబిన్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అంతే కాకుండా అతడికి హెచ్చరించారు. అయినప్పటికీ అతడి తీరులో మార్పు రాలేదు. దీంతో విమానం దిల్లీకి చేరుకున్నాక.. ఆ వ్యక్తిని భద్రతా సిబ్బందికి అప్పజెప్పారు. ఆ తర్వాత అతడు వారికి లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపాడు. ఎయిర్‌లైన్స్‌ నిబంధల తీవ్రతను బట్టి సదరు ప్యాసింజర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ వెల్లడించారు. గతంలోనూ ఇలాంటి అనుచిత ప్రవర్తన ఘటనలు ఎయిరిండియా విమానాల్లో జరిగాయి. ముంబయి నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు మల, మూత్ర విసర్జన చేశాడు. అంతే కాకుండా అక్కడే ఉమ్మివేశాడు. ప్రయాణికుడి దుష్ప్రవర్తనను గమనించిన క్యాబిన్‌ సిబ్బంది.. అతడిని హెచ్చరించారు. ఆ తర్వాత దిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. నిందితుడిని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI) పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com