టీటీడీ చైర్మన్ పదవి రేసులో నలుగురు.. మాజీ మంత్రివైపు అధిష్టానం మొగ్గు!

- July 29, 2023 , by Maagulf
టీటీడీ చైర్మన్ పదవి రేసులో నలుగురు.. మాజీ మంత్రివైపు అధిష్టానం మొగ్గు!

తిరుమల తిరుపతి దేవస్థానానికి కొత్త చైర్మన్ రాబోతున్నారా..? వచ్చేనెల 12తో వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం పూర్తవుతోంది. వైవీ స్థానంలో బీసీని చైర్మన్ చేయాలని భావిస్తోంది వైసీపీ. కానీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒక్క చాన్స్ ఇవ్వాలంటున్నారు. బీసీ కోటాలో మాజీ మంత్రి కొలుసు పార్థసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పేర్లు పరిశీలనలో ఉంది. ఈ నలుగురిలో కొత్త చైర్మన్ ఎవరు? వైసీపీ రాజకీయంలో తెరవెనుక ఏం జరుగుతోంది..?

టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎన్నో పైరవీలు.. మరెన్నో పూజలు చేస్తుంటారు.. కానీ వైసీపీ ప్రభుత్వంలో అలాకాదు.. సీఎం జగన్ అనుగ్రహం ఉన్నవారికే పదవులు దక్కుతాయి.. అది టీటీడీ చైర్మన్ అయినా.. ఇంకో పదవి అయినా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్‌గా.. సీఎం జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి కొనసాగుతున్నారు. టీటీడీ చరిత్రలో ఇంత సుదీర్ఘ కాలం చైర్మన్‌గా వ్యవహరించిన మరో నాయకుడు లేరు. మరో 8 నెలల్లో ఎన్నికలు ఉన్నందున కొత్తవారిని టీటీడీ చైర్మన్ చేయాలని భావిస్తోంది వైసీపీ హైకమాండ్. అంతేకాదు బీసీ నేతను చైర్మన్ చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.

ఆగస్టు 12న సుబ్బారెడ్డి పదవీ కాలం ముగియనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చైర్మన్ పదవి ఆశిస్తున్నారు. ఐతే వైసీపీ అధిష్టానం మాత్రం కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని టీటీడీ చైర్మన్ చేయాలని చూస్తోందట.. కానీ, పార్థసారధి ఎందుకనో టీటీటీ పదవిని వద్దని అంటున్నట్లు సమాచారం. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన పార్థసారధి వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఆశించారు. మంత్రి వర్గ విస్తరణ జరిగిన రెండుసార్లు ఆయనకు నిరాశ తప్పలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సీనియర్ నేతగా గౌరవించినట్లు అవుతుందని పార్థసారధిని చైర్మన్ చేయాలని భావిస్తోంది వైసీపీ. కానీ, ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తుండటంతో జంగా కృష్ణమూర్తి పేరు ఖరారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

మాజీ చైర్మన్ భూమన, ఎమ్మెల్యే చెవిరెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితులు అయినప్పటికీ.. వారిద్దరూ రెడ్డి సామాజిక వర్గం కావడంతో ఈ సారికి సారీ చెబుతున్నట్లు వైసీపీ వర్గాల టాక్. భూమన ఇప్పటికే ఒకసారి టీటీడీ చైర్మన్ పదవిని చేపట్టడం.. చెవిరెడ్డి తిరుపతి నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవితోపాటు పార్టీలోనూ కీలక పదవులు ఉండటం వల్ల మరొకరికి టీటీడీ చైర్మన్‌గా చాన్స్ ఇవ్వాలని చూస్తోందట వైసీపీ అగ్ర నాయకత్వం. మరీ ముఖ్యంగా సామాజిక న్యాయం పేరుతో బీసీలకు పెద్దపీట వేశామని చెప్పేందుకు ఎన్నికల ముందు బీసీ నేతనే చైర్మన్ చేయాలని అనుకుంటోంది వైసీపీ. పార్థసారధి వద్దనడంతో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నియామకం దాదాపు ఖరారైందని చెబుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com