కొత్త బస్సులను పరిశీలించిన TSRTC ఎండీ వీసీ సజ్జనర్
- December 22, 2023
హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తోంది.
హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో శుక్రవారం కొత్త లహరి స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్ ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య స్కీమ్ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
“ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. అందులో భాగంగా నాలుగైదు నెలల్లో 2 వేలకు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తోంది. వీటిన్నటిని వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు తెలిపారు.
ఈ కొత్త బస్సుల్లో బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని చెప్పారు. గమ్యస్థానాల వివరాలు కోసం బస్సుల్లో ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్) ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







