తిరుమలలో రెచ్చిపోయిన తమిళ యూట్యూబర్స్

- July 11, 2024 , by Maagulf
తిరుమలలో రెచ్చిపోయిన తమిళ యూట్యూబర్స్

తిరుమల: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలకు నిత్యం వేల సంఖ్యల భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తుంటారు. శ్రీవారి క్షేత్రంలో అణువణువు గోవిందమయం అని భక్తులు భావిస్తారు. ఎంతో భక్తిశ్రద్దలతో నడుచుకుంటారు. అటువంటి కొండపై భక్తితో నడుచుకోవాల్సింది పోయి కొందరు ఆకతాయిలు.. వెకిలి చేష్టలు, కోతి వేషాలు వేశారు.తిరుమలలో తమిళ యూటూబర్స్ రెచ్చిపోయారు. శ్రీవారి భక్తుల మనోభావాలను కించపరిచేలా వ్యవహరించారు. ప్రాంక్ వీడియోలతో భక్తులను ఎగతాళి చేశారు.

ఈ మధ్య కాలంలో ప్రాంక్ వీడియోల పైత్యం బాగా ముదిరింది. ఎదుటివారిని ఫూల్స్ చేసి పైశాచిక ఆనందం పొందే ఆకతాయిల సంఖ్య ఎక్కువైంది. తాజాగా తిరుమలలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కొందరు తమిళ యూట్యూబర్స్ శ్రీవారి భక్తులతో పరాచకమాడారు. వారి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్న భక్తులను ఆకతాయితనంతో ప్రాంక్ చేశారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉన్న భక్తుల ముందు యూట్యూబర్స్ వెకిలి చేష్టలు చేశారు. టీటీడీ ఉద్యోగుల్లా నటిస్తూ కంపార్ట్ మెంట్ తాళాలు తీస్తున్నట్లుగా ప్రాంక్ చేశారు టీటీఎఫ్ వాసన్ అనే తమిళ యూట్యూబర్, అతడి వెకిలి బ్యాచ్. నిజంగానే తాళాలు తీస్తున్నారేమోనని భావించిన భక్తులు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఇది చూసి ఆకతాయిలు వెకిలిగా నవ్వుతూ అక్కడి నుంచి పరుగులు తీశారు. ఇలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూలైన్లలో ఈ కోతి చేష్టల బ్యాచ్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. భక్తులతో మనోభావాలతో ఆడుకోవడమే కాదు.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.

వారు చేసిన ప్రాంక్ పై శ్రీవారి భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. వారిని అలా వదిలేయకుండా తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిందేనని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి వెకిలి చేష్టలు ఎవరూ చేయకుండా చర్యలు ఉండాలంటున్నారు. ఇక, యూట్యూబర్స్ వెకిలి చేష్టలను తీవ్రంగా పరిగణించిన టీటీడీ.. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది టీటీడీ.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com