సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- October 08, 2024
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక టాంపినీస్ సెంట్రల్ పార్క్ లో సింగపూర్ బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి.పితృ అమావాస్యనాడు ప్రారంభమై, తొమ్మిది రోజుల పాటు కొనసాగి, చివర్లో సద్దుల బతుకమ్మతో ముగిసే ఈ వేడుకల్లో, మహిళలు పూలనే గౌరమ్మగా పేర్చి రోజుకో బతుకమ్మగా పూజించి ఆశీస్సులు పొందడం సంప్రదాయం.
సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన ఈ వేడుకలకు సింగపూర్ లోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఆడపడచులు, పిల్లలు, మరియు పెద్దలు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. పూలతో తయారు చేసిన అందమైన బతుకమ్మలను మధ్యలో ఉంచి, అందరూ కలిసి వలయాకారంలో జానపద పాటలు పాడుతూ, ఆడుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆనందంగా వేడుక జరుపుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో చిన్నాపెద్దా అందరూ ఆడిపాడి ఈ వేడుకను మరింత రంగరించారు. ఈ సందర్భంగా సింగపూర్ స్థానికులు కూడా వేడుకను ఆసక్తిగా తిలకించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత బతుకమ్మలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతిని తెలియజేసే విశిష్టతను ఉటంకించారు. ఈ పండుగ తెలుగువారి ఐక్యతను ప్రపంచమంతా చాటుతుందనీ, సింగపూర్ లో కూడా ఈ సంబరం నిర్వహించడం వల్ల తెలుగువారంతా ఒక్కటైనట్లు అనిపిస్తోందని అన్నారు. తెలుగు సమాజంలో సభ్యత్వం తీసుకోవాలని, అందరూ కలిసి ఈ సంస్కృతి పునరుద్ధరణకు కృషి చేయాలని కోరారు.
కార్యక్రమ నిర్వాహకులు పుల్లనగారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆర్ ఆర్ హెచ్ సి , నార్పాణి టాంపినీస్ సిసి ఐఎఇసి వంటి స్ధానిక సంస్ధల సహకారంతో సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో నిర్వహించబడిందని చెప్పారు.ముఖ్యంగా బతుకమ్మల అందం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉత్తమంగా అలంకరించిన మూడు బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు, అలాగే ఈ సంవత్సరం 8 ప్రోత్సాహక బహుమతులు కూడా ప్రధానం చేశారు. కొత్త సుప్రియ సారధ్యంలో నడుస్తున్న ‘అమ్మ చారిటబుల్’ సంస్థ సహకారంతో ఈ బహుమతులు అందించామన్నారు.
గౌరవ కార్యదర్శి పోలిశెట్టి అనిల్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి సుమారు 2000 మంది హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారని, వారికి కార్యక్రమానంతరం కుంభకర్ణ, Mr. బిరియాని, ఫ్లేవర్స్, తందూర్ లాంజ్, ఆంధ్రకర్రీ, మరియు బంజార రెస్టారెంట్ వంటి వారి భాగస్వామ్యం లో భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాల మాధ్యమాల ద్వారా సుమారు 6000 మంది ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారని, 10 మంది లక్కీ విజేతలకు వెండి మరియు ఇతర ఆకర్షణీయ బహుమతులు అందజేశారని చెప్పారు.
సింగపూర్ లో తెలుగు వాసుల ఐక్యతను చాటుతూ, వారి సాంస్కృతిక భావాలను పదిలపరిచిన ఈ బతుకమ్మ వేడుక సింగపూర్ తెలుగు సమాజానికి మరింత గౌరవం తీసుకొచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!