ఆదివారం ఒక్క రోజే 24 విమానాలకు బాంబు బెదిరింపులు

- October 20, 2024 , by Maagulf
ఆదివారం ఒక్క రోజే 24 విమానాలకు బాంబు బెదిరింపులు

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో పలు విమానాలు సాంకేతిక లోపాలతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంటే.. మరోపక్క విమానాలలో బాంబులు ఉన్నాయని ఫేక్ ఫోన్ కాల్స్ తో ఆకతాయిలు అలజడి సృష్టిస్తున్నారు. రీసెంట్ గా అక్టోబర్ 20 ఆదివారం రోజున ప్రపంచవ్యాప్తంగా 24 విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేగింది. ఈ బెదిరింపులు ఇండిగో, విస్తారా, ఎయిరిండియా, ఆకాశ్ వంటి పలు విమానయాన సంస్థలకు చెందినవి. ఈ బెదిరింపుల కారణంగా విమానయాన సంస్థలు అత్యవసర తనిఖీలు చేపట్టాయి. గత ఆరు రోజుల్లో 100 విమానాలకు ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడం వల్ల అధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

రీసెంట్ గా దిల్లీ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన విస్తారా విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించి, అక్కడ తనిఖీలు నిర్వహించి, రెండు గంటల తర్వాత తిరిగి లండన్‌కు పంపించారు. గమ్యస్థానాలకు చేరుకున్న తర్వాత కూడా కొన్ని విమానాలకు బాంబు బెదిరింపులు అందాయి. ఇంకా ఢిల్లీ-ఇస్తాంబుల్‌ విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్‌ కాల్ రావడం వల్ల విమానయాన సంస్థలు, అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ కాల్‌ కారణంగా విమానాన్ని నిలిపివేసి, సిబ్బంది మరియు ప్రయాణికులను సురక్షితంగా దించేశారు.
ఇంకా ఈరోజు పలుచోట్ల ఇతర విమానాల్లో బాంబులు పెట్టినట్లు హెచ్చరికలు రావడం వల్ల అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

ఇలాంటి ఫేక్‌ ఫోన్‌కాల్స్‌ వల్ల విమానయాన సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ప్రతి బెదిరింపును సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున, ప్రతి విమానాన్ని నిలిపివేసి తనిఖీలు చేయడం తప్పనిసరి అవుతోంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (BCAS) ఎయిర్‌లైన్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. బాంబు బెదిరింపులకు పాల్పడే వారిని నో-ఫ్లై లిస్ట్‌లో చేర్చాలని, అలాంటి వారికి కఠిన శిక్షలు విధించాలని పౌర విమానయాన శాఖ యోచిస్తోంది. 

ఇలాంటి బెదిరింపులు ప్రయాణికుల్లో భయాన్ని రేకెత్తిస్తున్నాయి. విమానయాన సంస్థలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఈ బెదిరింపులు ఆగడం లేదు. ఈ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు తీసుకోవడం అవసరం. ప్రయాణికుల భద్రతను కాపాడుకోవడం కోసం అధికారులు, విమానయాన సంస్థలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ పరిస్థితి ప్రయాణికుల్లో భయాన్ని రేకెత్తిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com