మహారాష్ట్రలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్..
- November 20, 2024
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈరోజు (నవంబర్ 20) ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6గంటలకు ప్రశాంతంగా ముగిసింది. అయితే, సాయంత్రం 5 గంటల వరకు మహారాష్ట్రలో 58.22శాతం ఓటింగ్ నమోదైంది. ఔరంగాబాద్లో 60.83శాతం, అహ్మద్నగర్లో 61.95శాతం పోలింగ్ నమోదైంది.
మరోవైపు ముంబైలో 49.07శాతం, నాగ్పూర్లో 56.06శాతంగా నమోదయ్యాయి. సతారాలో 64.16శాతం ఓటింగ్ నమోదైంది. మహాయుతి కూటమిలో బీజేపీ 149 స్థానాల్లో, శివసేన 81 స్థానాల్లో, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ప్రత్యర్థి వైపు, ఎంవీఏ కూటమిలో 101 మంది అభ్యర్థులతో కాంగ్రెస్, 95 మందితో శివసేన (UBT), 86 మంది అభ్యర్థులతో NCP (శరద్ పవార్) ఉన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీతో కూడిన అధికార మహాయుతి కూటమి, కాంగ్రెస్, శివసేన (యూబీటీ) తో కూడిన ప్రతిపక్షం మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ), ఎన్సీపీ, (SP) మధ్య హోరాహోరీ పోరు జరిగింది. మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ నవంబర్ 20న సాయంత్రం 6:30 గంటల తర్వాత వెల్లడి కానున్నాయి. ఇదిలా ఉండగా, జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన రెండో దశ ఎన్నికలలో సాయంత్రం 5 గంటల సమయానికి 38 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 67.59శాతం ఓటింగ్ నమోదైంది.
మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు 4వేల 136మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మహారాష్ట్రలో లక్షా 186 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఏర్పాటు చేసింది. మహారాష్ట్ర ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. మహారాష్ట్రలో సినీ, రాజకీయ, క్రీడాప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ముంబైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. థానేలో సీఎం ఏక్నాథ్ శిండే కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్సీపీ ఎస్పీ పార్టీ అధినేత శరద్ పవార్ బారామతిలో తన ఓటును వేశారు. శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే, సతీమణి రష్మి, కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సినీ తారలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, రణ్బీర్ కపూర్, అర్జున్ కపూర్, అర్బాన్ ఖాన్, సోనూ సూద్, జోయా అక్తర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఈనెల 23న వెలువరించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







