ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

- December 09, 2024 , by Maagulf
ఢిల్లీలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

-ఆర్కేపురంలోని రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపు

-ఈ-మెయిల్‌ ద్వారా స్కూళ్లకు బాంబు బెదిరింపు

-స్కూళ్లలో కొనసాగుతున్న బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. సోమవారం ఉదయం ఢిల్లీలోని రెండు పాఠశాలల్లో బాంబులు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. ఆర్కే పురంలోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ (DPS), పశ్చిమ్‌ విహార్‌లోని జీడీ గోయెంకా స్కూళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్‌ ద్వారా బాంబు బెదిరింపులు పంపారు.

ఈ బెదిరింపుల నేపథ్యంలో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తమై, విద్యార్థులను ఇండ్లకు పంపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్క్వాడ్‌తోపాటు అగ్నిమాపక సిబ్బంది రెండు స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు.

ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఢిల్లీలోని పలు పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది మే నెలలో కనీసం 60 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అయితే, దర్యాప్తులో బాంబులు లేదా పిల్లల భద్రతకు ఎటువంటి ముప్పు లేదని తేలింది.

ఈ సంఘటనల నేపథ్యంలో పాఠశాలలు, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. విద్యార్థుల భద్రతను కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఈ విధమైన బెదిరింపులు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. భద్రతా చర్యలు మరింత కఠినంగా అమలు చేయడం అవసరం అని అధికారులు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com