కొత్త జెర్సీలతో భారత్ ఆటగాళ్లు..

- February 18, 2025 , by Maagulf
కొత్త జెర్సీలతో భారత్ ఆటగాళ్లు..

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుబాయ్ కు చేరుకున్న జట్టు ఆటగాళ్లు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. పాకిస్థాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఈనెల 19 (బుధవారం) నుంచి ప్రారంభమవుతుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఈనెల 20వ తేదీన బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది. భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. అయితే, తాజాగా.. టీమిండియా ప్లేయర్లు కొత్త జెర్సీల్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్ మన్ గిల్ తోపాటు రిషబ్ పంత్, మహ్మద్ షమీ తదితర ప్లేయర్లు తాము ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమంటూ కొత్త జెర్సీలతో ఫోజులిచ్చారు. అయితే, టీమిండియా ఆటగాళ్లు ధరించిన జెర్సీలపై పాకిస్థాన్ పేరు ఉంది. అయితే, ఈ విషయంపై బీసీసీఐ గత కొద్దిరోజుల క్రితమే క్లారిటీ ఇచ్చింది.

గతంలో పలువురు అభిమానులు భారత జెర్సీలపై పాకిస్థాన్ పేరును తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అయితే, బీసీసీఐ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. టోర్నమెంట్ సమయంలో క్రికెట్ బోర్డు, భారత జట్టు ఐసీసీ ఆదేశాలకు కట్టుబడి ఉంటుందని, భారత జెర్సీలపై పాక్ పేరును తొలగించాలని మేము ఐసీసీని కోరలేమని బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. జెర్సీలపై ఉండే ట్రోఫీకి సంబంధించిన లోగోపై తమ దేశం పేరు ఉండేందుకు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ కు హక్కు ఉందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com