ఏపీ ప్రజలకు శుభవార్త...

- May 12, 2025 , by Maagulf
ఏపీ ప్రజలకు శుభవార్త...

అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రాష్ట్రంలో పౌర సరఫరాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. నూతన రేషన్ కార్డుల జారీతోపాటు ఇతర ఆరు రకాల అనుబంధ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సేవలను ఇప్పటికే 17,519 మంది వినియోగించుకున్నారని, మే 15వ తేదీ నుంచి వాట్సాప్ గవర్నెన్స్ విధానం ద్వారా కూడా ఇంటి వద్ద నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఈనెల 8వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, కుటుంబ సభ్యుల చేర్పులు, తొలగింపులు, కార్డుల సరెండర్ వంటి ఆరు రకాల సేవలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అయితే, 15వ తేదీ నుంచి 95523 00009 నంబర్‌కు వాట్సాప్ లో “Hello” అని మెసేజ్ పంపడం ద్వారా కూడా ఈ సేవలను పొందవచ్చు. అంతేకాక జూన్ నెలలో అర్హులైన వారందరికీ ఉచితంగా స్మార్ట్ కార్డుల రూపంలో నూతన రేషన్ కార్డులను అందించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1,46,21,223 కాగా.. ఇందులో దాదాపు 4,24,59,028 మంది ఉన్నారని, ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, 80ఏళ్లు పైబడిన వ్యక్తులు సహా 6,45,765 మందికి ఈ-కేవైసీ నిబంధనను పాటించకుండా మినహాయింపు ఇచ్చామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ-కేవైసీ ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసిన వారందరికీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

ఒంటిరిగా నివసిస్తున్న వారు, 50ఏళ్లు పైబడి వివాహం కానివారు, భార్యాభర్తల నుంచి విడిపోయిన వారు, అనాథాశ్రమాల్లో నివసించే వృద్ధులు కూడా నూతన రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి నాదెండ్ల స్పష్టం చేశారు. అయితే, మొట్టమొదటి సారిగా లింగమార్పిడి చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డు సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. సామాజిక భద్రతా పెన్షన్లు పొందుతున్న కళాకారులు, కొండ ప్రాతాల్లో నివసించే 12 తెగల ప్రజలకు ప్రత్యేక అంత్యోదయ అన్న యోజన కార్డులను అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com