చీనాబ్ రైల్వే బ్రిడ్జిని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ
- June 06, 2025
న్యూ ఢిల్లీ: మౌలిక సదుపాయాల నిర్మాణంలో భారత్ ఒక చరిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ప్రధాని మోదీ శుక్రవారం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. ఈ అద్భుతమైన నిర్మాణంతో కశ్మీర్ లోయ దేశంలోని మిగిలిన ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానమైంది. ఇది ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగం. ఈ ఉదయం ఉధంపూర్లోని వైమానిక దళ కేంద్రానికి చేరుకున్న ప్రధాని అక్కడి నుంచి చీనాబ్ వంతెన నిర్మించిన ప్రదేశానికి వెళ్లారు. అక్కడ ఈ ప్రతిష్ఠాత్మక వంతెనను అధికారికంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఏప్రిల్లో 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా సరిహద్దు దాటి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత ప్రధాని జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
చీనాబ్ నదిపై నిర్మించిన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ వంతెన ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని భారతదేశపు మొట్టమొదటి కేబుల్ ఆధారిత (కేబుల్-స్టేయిడ్) రైల్వే వంతెన అయిన అంజి వంతెనను కూడా ప్రారంభించనున్నారు. ఇది కూడా ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తుంది.
అంతేకాకుండా, శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, శ్రీనగర్ మధ్య రెండు కొత్త వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్ల రాకతో, మొత్తం 272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (యూఎస్బీఆర్ఎల్) ప్రాజెక్ట్ మార్గం పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్టు అయ్యింది. ఈ పరిణామాలు జమ్మూకశ్మీర్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయని, అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తాయని భావిస్తున్నారు. కాశ్మీర్ లోయకు అన్ని కాలాల్లోనూ నిరంతర రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల కల ఈ ప్రాజెక్టులతో సాకారమవుతోంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







