ఇరాన్‌ పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం..

- June 13, 2025 , by Maagulf
ఇరాన్‌ పై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం..

మిడిల్ ఈస్ట్ లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ టార్గెట్ గా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. ఇరాన్ కు చెందిన అణు కర్మాగారం, సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు.. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్ లో అత్యవసర పరిస్థితి విధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఇరాన్ కాలమానం ప్రకారం.. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత టెహ్రాన్ పై ఇజ్రాయెల్ తొలుత దాడులు చేసింది. ఆ తరువాత శుక్రవారం ఉదయం రెండో దశ దాడులు ప్రారంభించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌పై దాడులు చేయొద్దని అమెరికా హెచ్చరించినా ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టి మరీ ఈ దాడులకు పాల్పడింది.

మరోవైపు.. ఈ దాడులకు ఇరాన్ ప్రతిస్పందించే అవకాశం ఉండటంతో దేశవ్యాప్తంగా ఇజ్రాయెల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. తమ దేశంలోని పౌరులే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. ఈ క్రమంలో ఇరాన్ దాడులను తిప్పికొట్టేందుకు ఇజ్రాయెల్ ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇదిలాఉంటే.. ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో ఇరాన్‌కు భారీ నష్టం​ జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ దాడుల్లో ఇరాన్‌ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మృతి చెందినట్లు తెలిసింది.

ఇజ్రాయెల్ దాడులపై ఆ దేశ ప్రధాని నేతన్యాహు వీడియో ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ పై ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ ప్రారంభించామని తెలిపారు. ఇరాన్ అణ్వాయుధీకరణ కార్యక్రమం, అణు కేంద్రాలను టార్టెట్ చేసినట్లు చెప్పొకొచ్చారు. ఇరాన్ పై ఆపరేషన్ రైజింగ్ లయన్ ప్రారంభమైంది. ఎన్నిరోజులైన ఆపరేషన్ కొనసాగుతుందని అన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంతోపాటు.. ఇజ్రాయెల్ ను విధ్వంసం చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. ఇరాన్ తొమ్మిది అణు బాంబులకు తగినంత యురేనియంను ఉత్పత్తి చేసింది. ఇరాన్ చాలా తక్కువ సమయంలో అణ్వాయుధాన్ని ఉత్పత్తి చేయగలదు. ఇది ఒక సంవత్సరం కావచ్చు, కొన్ని నెలల్లోపు కావచ్చు, ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో కావచ్చు. అదేజరిగితే ఇజ్రాయెల్ మనుగడకు ముప్పుగా మారుతుందని నెతన్యాహు తెలిపారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న వైమానిక దాడులతో తమ దేశానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రూబియో తెలిపారు. టెహ్రాన్‌ దాడికి రావొద్దని, తమ దేశానికి చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవద్దని ఆయన సూచించారు. అమెరికా బలగాలను కాపాడుకోవడమే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com