'నో ఫుడ్, వాటర్': దుబాయ్ లో 5 గంటల పాటు ప్రయాణికులు నరకయాతన..!!

- June 16, 2025 , by Maagulf
\'నో ఫుడ్, వాటర్\': దుబాయ్ లో 5 గంటల పాటు ప్రయాణికులు నరకయాతన..!!

యూఏఈ: దుబాయ్ నుండి జైపూర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో ఉన్న ప్రయాణికులు ఆహారం, నీరు లేకుండా ఐదు గంటలకు పైగా నరకయాతన అనుభవించారు. ప్రయాణికులు గ్రౌండ్ చేసిన విమానంలో చిక్కుకుపోయారు. ఎయిర్ ఇండియా తీరుపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వివరాల్లోకి వెళితే.. జూన్ 13న సాయంత్రం 7.25 గంటలకు దుబాయ్ నుండి బయలుదేరాల్సిన విమానం IX-196 సాంకేతిక లోపం కారణంగా సకాలంలో బయలుదేరలేకపోయింది. కానీ క్యాబిన్ ఉష్ణోగ్రతలు పెరగడంతో 150 మందికి పైగా ప్రయాణికులను విమానంలోకి దిగడానికి అనుమతించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ప్రయాణికుల ఇబ్బందులను తెలిపే ఓ వీడియోను భారతీయ డైటీషియన్,  సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అర్జూ సేథి సోషల్ మీడియాలో పోస్ట్  చేశారు. ప్రయాణికులు ఆందోళనతో కనిపించారు. చెమటతో తడిసిపోయారు. భద్రతా కార్డులు, చల్లగా ఉండటానికి వారు దొరికిన వస్తువులతో గాలిని ఊపుకోవడం కనిపించించింది.

“మమ్మల్ని సాయంత్రం 7 గంటలకు విమానం ఎక్కించారు. కానీ విమానంలోని ఏసీ ఆన్ చేయలేదు. నా మూడేళ్ల కొడుకు చెమటతో తడిసిపోయాడు. ఒక్క అటెండెంట్ కూడా మాకు సహాయం చేయడానికి రాలేదు. ఎవరూ మాకు ఆహారం ఇవ్వలేదు, నీరు కూడా ఇవ్వలేదు. విమానంలో సాంకేతిక లోపం ఉంటే, వారు మమ్మల్ని టెర్మినల్‌లో వేచి ఉండనివ్వాల్సింది. కానీ వారు మమ్మల్ని ఇలా లోపల లాక్ చేయాలని నిర్ణయంచుకున్నారు.”” అని సేథి తన పోస్ట్‌లో వాపోయారు.  "ఊపిరాడక ఇబ్బంది అవుతోంది. ఎయిర్ కండిషనింగ్ పనిచేయడం లేదు. మేము కాల్ బటన్‌ను నొక్కుతూనే ఉన్నాము. కానీ ఎవరూ రాలేదు. అది హింసలా అనిపించింది" అని మరో ప్రయాణికుడు రవి కుమార్ రీ ట్వీట్ చేశాడు.   

దాదాపు 5 గంటల ఆలస్యంతో విమానం చివరికి అర్ధరాత్రి 12.44 గంటలకు బయలుదేరింది. షెడ్యూల్ కంటే ఐదు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. జూన్ 14న తెల్లవారుజామున 2.44 గంటలకు జైపూర్‌ కు చేరింది. అప్పటి నుండి చాలా మంది ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. 

ఎట్టకేలకు ఈ సంఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ స్పందించింది.  "కొన్ని ఎయిర్‌స్పేస్‌లను మూసివేసిన తర్వాత ATC రద్దీ కారణంగా యూఏఈలోని నగరాల నుండి వచ్చే మా విమానాలలో కొన్ని బోర్డింగ్ తర్వాత ఆలస్యం అవుతున్నాయి. ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థ సాధారణంగా పనిచేస్తోంది. కానీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఏసీలను ఆన్ చేయలేదు. కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము." అని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com