ఏపీ డ్వాక్రా మహిళలకు సబ్సిడీ ఎలక్ట్రిక్ వాహనాలు
- July 11, 2025
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం ఎంతో వినూత్నంగా ఓ పథకాన్ని ప్రారంభించింది. సమాజంలో మహిళల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఈ కార్యక్రమం దూసుకుపోతోంది. మెప్మాతో ర్యాపిడోను అనుసంధానం చేసి పథకాన్ని అమలు చేస్తున్నారు. బైక్లు, ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కొందరికి స్కూటీలు, మరికొందరికి ఆటోలు పంపిణీ చేసింది. ఈ పైలెట్ ప్రాజెక్ట్ ప్రస్తుతం ప్రధాన నగరాల్లో నడుస్తోంది. ఉదాహరణకు తీసుకుంటే, విజయవాడ, విశాఖపట్నంలో 400 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి మరింతమందిని ర్యాపిడో నెట్వర్క్లో చేర్చాలని భావిస్తున్నారు.
మెప్మాతో ర్యాపిడో అనుసంధానం చేయడంతో, డ్వాక్రా మహిళలకు ర్యాపిడో యాప్ వాడకంపై శిక్షణ ఇస్తున్నారు.డ్వాక్రా గ్రూప్ ద్వారా వాహనాలు తీసుకుంటే కనుక, స్కూటీ, బైక్కు రూ.12 వేలు, ఆటో తీసుకుంటే రూ.30 వేల సబ్సిడీ ఇస్తారు. ర్యాపిడో ద్వారా అదనపు ఆదాయం వస్తుంది.నెలకు 150 రైడ్స్ చేస్తే రూ.వెయ్యి, 300 రైడ్స్ చేస్తే రూ.2వేలు వ్యాలెట్లో జమ అవుతాయి. వీటితో పాటుగా పలు సదుపాయాలు, మంచి ఆదాయం పొందవచ్చు. ఈ పథకం ద్వారా రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు సంపాదిస్తున్నామంటున్నారు లబ్ధిదారులైన మహిళలు.ఈ ఉపాధి మా తమ కుటుంబాన్ని ఆదుకుంటుందని, పిల్లల చదువులు, ఇతర ఇంటి అవసరాలకు ఆదాయంగా మారిందంటున్నారు. తమ స్వయం ఉపాధికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతోందని మహిళలు చెబుతున్నారు.
వినియోగదారులు ఒక్క క్లిక్తో యాప్లో ర్యాపిడోలో బైక్, ఆటోలను బుక్ చేసుకుంటే చాలు నిమిషాల్లో వస్తున్నారు.ప్రయాణికులను ఎక్కించుకుని వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.ఏపీ ప్రభుత్వం ప్రపంచ మహిళా దినోత్సవం రోజు ఈ కొత్త పథకాన్ని ప్రారంభించింది. డ్వాక్రా గ్రూపు మహిళల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి ఈ-బైక్లు, ఈ-ఆటోలు సమకూరుస్తున్నారు. వీరిని ర్యాపిడోతో అనుసంధానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా మహిళల ఉపాధికి అవకాశం దొరికింది. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలుతో పాటు పలు చోట్ల ఈ-బైక్లు, ఈ-ఆటోలు సబ్సిడీపై అందజేశారు. అంతేకాదు సబ్సిడీతో పాటుగా ముద్ర, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా రుణాలు అందించి వాహనాలు కొనుగోలు చేసే సౌకర్యం కూడా ఉంది.
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఏముంటుంది?
ఎలక్ట్రిక్ వాహనం (EV) అనేది ప్రధానంగా బ్యాటరీ ద్వారా విద్యుత్ను తీసుకుని మోటార్ ద్వారా నడిచే వాహనం. ఇవి పూర్తిగా విద్యుత్తో నడిచే వాహనాలు కావచ్చు, లేదా విద్యుత్ మోటార్తో పాటు అంతర్గత దహన ఇంజిన్ కూడా కలిగి ఉండే ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు కావచ్చు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!