క్షమాభిక్ష ప్రకటించిన మలేషియా ప్రభుత్వం
- July 30, 2025
కౌలలంపూర్: మలేషియా ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్మికుల కోసం మైగ్రంట్ రిపాట్రియేషన్ ప్రోగ్రాం 2.0 (PRM 2.0) అనే క్షమాభిక్ష కార్యక్రమాన్ని ప్రకటించింది. ఉపాధి కోసం మలేషియాకు వెళ్లి, అనివార్య పరిస్థితుల్లో చిక్కుకున్న అక్రమ వలసదారులు ఈ కార్యక్రమం ద్వారా జైలు శిక్ష లేదా భారీ జరిమానాలు లేకుండా సురక్షితంగా స్వదేశానికి తిరిగి వెళ్లవచ్చు.
కార్యక్రమ వివరాలు...
మలేషియా ఇమ్మిగ్రేషన్ శాఖ ప్రకటించిన ఈ కార్యక్రమం మే 19, 2025 నుండి ఏప్రిల్ 30, 2026 వరకు అమలులో ఉంటుంది. ఈ కాలంలో, చట్టవిరుద్ధంగా నివసిస్తున్న కార్మికులు కేవలం 500 మలేషియన్ రింగ్గిట్ (సుమారు రూ.10,000) జరిమానా చెల్లించి తమ దేశాలకు తిరిగి వెళ్లవచ్చు. పాస్పోర్ట్ లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ పొందవచ్చు, అయితే సొంత ఖర్చుతో ఒక వారంలోపు విమాన టికెట్ కొనుగోలు చేయాలి.
ఈ కార్యక్రమం పాస్పోర్ట్ లేని వారు, వర్క్ పర్మిట్ లేదా వీసా గడువు ముగిసిన వారికి కూడా అవకాశం కల్పిస్తుంది. చట్టవిరుద్ధంగా ఉంటూ పట్టుబడితే, కార్మికులు 10,000 రింగ్గిట్ (సుమారు రూ.2 లక్షలు) జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఈ క్షమాభిక్ష కార్యక్రమం ద్వారా ఈ శిక్షలను తప్పించుకోవచ్చు.
భారతీయ కార్మికుల పరిస్థితి...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశం నుండి వేలాది మంది కార్మికులు మలేషియాలో పామ్ ఆయిల్, రబ్బర్ తోటలు, నిర్మాణ రంగం, హోటళ్లలో పనిచేస్తున్నారు. అయితే, చాలా మంది ఏజెంట్ల మోసాలకు గురై, విజిట్ వీసాపై తీసుకొచ్చి వర్క్ పర్మిట్ ఇవ్వకుండా చట్టవిరుద్ధ కార్మికులుగా మారారు. ఈ కార్యక్రమం వారికి సురక్షితంగా స్వదేశం చేరే అవకాశాన్ని అందిస్తోంది.
తెలుగు సంఘాల సలహా...
మలేషియాలోని తెలుగు సంఘాలు కార్మికులను ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలను సంప్రదించి, జరిమానా చెల్లించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాయి. మరిన్ని వివరాల కోసం ఫెడరేషన్ ఆఫ్ ఎన్ఆర్ఐ కల్చరల్ అసోసియేషన్స్, మలేషియాను [email protected] లేదా http://www.fnca.com.my ద్వారా సంప్రదించవచ్చని ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు.
ప్రభుత్వాలకు విజ్ఞప్తి...
ఈ కార్యక్రమం గురించి మలేషియాలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కార్మికులకు తెలిసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రముఖ మీడియా ద్వారా అధికారిక ప్రకటనలు చేయాలని బూరెడ్డి మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే, కార్మికులు సురక్షితంగా స్వదేశం చేరేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ క్షమాభిక్ష కార్యక్రమం ద్వారా చట్టవిరుద్ధ కార్మికులు తమ భవిష్యత్తును సురక్షితం చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అధికారులు, సంఘాలు సూచిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్







