BCCI కొత్త సెలక్టర్ల కోసం బీసీసీఐ ఆహ్వానం
- August 22, 2025
భారత క్రికెట్లో మరోసారి పెద్ద మార్పులకు దారితీసే విధంగా బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) BCCI కీలక నిర్ణయం తీసుకుంది.జాతీయ స్థాయి క్రికెట్ సెలక్షన్ కమిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని అధికారికంగా ప్రకటించింది.శుక్రవారం బీసీసీఐ నుంచి వచ్చిన ప్రకటనలో సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీతో పాటు మహిళల, జూనియర్ సెలక్షన్ కమిటీలలో కూడా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేసింది.ప్రస్తుతం అజిత్ అగార్కర్ నేతృత్వంలో కొనసాగుతున్న సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీలో రెండు ఖాళీలు త్వరలోనే ఏర్పడనున్నాయి. అగార్కర్తో పాటు ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్. శరత్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
అయితే కాంట్రాక్టులు వార్షిక ప్రాతిపదికన పునరుద్ధరించబడటం వలన ఎవరెవరు కొనసాగుతారు, ఎవరికి బదులుగా కొత్తవారు వస్తారన్న దానిపై ఆసక్తికర చర్చ మొదలైంది. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, త్వరలోనే ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇవ్వనున్నారు.ఈ కమిటీ ఇటీవలే ఆసియా కప్ కోసం భారత జట్టును ఎంపిక చేసింది. పెద్ద టోర్నమెంట్లలో జట్టును సరిగ్గా సమన్వయం చేయడం, టాలెంట్ ఉన్న ఆటగాళ్లకు అవకాశమివ్వడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు వీరి చేతిలోనే ఉంటాయి. అందుకే ఈ ఖాళీలు భర్తీ కావడం ఎంతో ప్రాధాన్యమైంది.సెలక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హత ప్రమాణాలలో ఎలాంటి మార్పులు చేయలేదు.
కనీసం ఏడు టెస్టు మ్యాచ్లు లేదా 30 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉండాలి. లేదా 10 వన్డే ఇంటర్నేషనల్స్ (ODI) లేదా 20 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లు ఆడిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.మరోవైపు, నీతూ డేవిడ్ నేతృత్వంలోని మహిళల జాతీయ సెలక్షన్ కమిటీలో ఏకంగా నాలుగు స్థానాల భర్తీకి బీసీసీఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. అండర్-22 స్థాయి వరకు జట్లను ఎంపిక చేసే జూనియర్ క్రికెట్ సెలక్షన్ కమిటీలో కూడా ఒక సభ్యుడి స్థానం ఖాళీగా ఉంది. ఇది చీఫ్ సెలక్టర్ పదవి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను సెప్టెంబర్ 10వ తేదీలోగా సమర్పించాలని బోర్డు సూచించింది.
తాజా వార్తలు
- సముద్ర రాకపోకలను లక్ష్యంగా చేసుకున్న ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు: యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ
- ఇరాన్తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలు నిలిపివేసిన యూఏఈ
- ఫ్లయింగ్ కారు రవికి కేంద్ర మంత్రి సపోర్ట్..!
- ఇరాన్ నుంచి యూఏఈ వైపు రెండు బాలిస్టిక్ క్షిపణులు..
- భూకంప బాధిత కొలంబియాలో 10 పాఠశాలల పునర్నిర్మాణానికి షకీరా హామీ
- టీనేజర్ల కోసం కొత్త వెర్షన్ ChatGPT..!
- యూఏఈలో క్షిపణి ముప్పు అలెర్ట్ ఉపసంహరణ.. సాధారణ కార్యకలాపాలకు అనుమతి
- యూఎస్ అధ్యక్షుడు ట్రంప్తో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం-పీపుల్స్ పల్స్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్
- ఉచితంగా జర్మన్ భాష నేర్పించి విదేశాల్లో ఉద్యోగాలు!







