వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- November 07, 2025
న్యూ ఢిల్లీ: భారత జాతీయ గీతం ‘వందేమాతరం’ 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన వందేమాతరం స్మారక నాణెం మరియు పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు. ఈ గీతం దేశ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని ప్రధాని అన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, “నవంబర్ 7 ఒక చారిత్రకమైన రోజు. వందేమాతరం అనేది కేవలం ఒక పదం కాదు, అది ఒక మంత్రం, ఒక శక్తి, ఒక కల, ఒక సంకల్పం” అని తెలిపారు. ఇది మనల్ని చరిత్రతో అనుసంధానించి, మనం సాధించలేని కల ఏదీ లేదని గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన వీరులకు ఆయన నివాళులర్పించారు.
ఈ వేడుకల్లో భాగంగా ఉదయం 9:50 గంటలకు దేశవ్యాప్తంగా ప్రజలు ఉన్నచోటనే సామూహికంగా వందేమాతరం పూర్తి గీతాన్ని ఆలపించారు. పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో పౌరులు ఉత్సాహంగా పాల్గొని ఢిల్లీలోని ప్రధాన కార్యక్రమంతో గొంతు కలిపారు. పౌరులు తమ గళంతో వందేమాతరం పాడి పంపేందుకు ఒక డిజిటల్ పోర్టల్ను కూడా ఈ సందర్భంగా ప్రారంభించారు.
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించడానికి భారతీయులందరినీ ఏకం చేయగల శక్తి వందేమాతరానికి ఉందని అన్నారు. 1875 నవంబర్ 7న బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారు. ఆయన రాసిన ప్రఖ్యాత నవల ‘ఆనందమఠం’ లో భాగంగా ఈ గీతం తొలిసారిగా ‘బంగదర్శన్’ అనే పత్రికలో ప్రచురితమైంది. ఈ గీతం స్వదేశీ ఉద్యమానికి ప్రధాన నినాదంగా మారి, జాతీయ చైతన్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ ఉత్సవాలు 2026 నవంబర్ 7 వరకు కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







