డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా‌ ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

- November 09, 2025 , by Maagulf
డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా‌ ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

దుబాయ్‌: ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు 2025 డిసెంబర్ 12 నుండి 14, 2025 వరకు  దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించబడుతుందని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి(WTITC) అధికారికంగా ప్రకటించింది.మూడు రోజుల ఈ అంతర్జాతీయ మహా సభలు డిసెంబర్ 12న ప్రత్యేకమైన నెట్‌వర్కింగ్ ఈవెంట్ మరియు యాచ్ పార్టీతో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత డిసెంబర్ 13 మరియు 14 తేదీల్లో ప్రధాన సమావేశాలు మరియు డబ్ల్యూటిఐటిసి కు నూతన నాయకత్వం వహించేవారు ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది.

ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించబడే “ప్రపంచ తెలుగు ఐటీ మహా సభలు” ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తల అత్యంత ప్రాధాన్యమైన ప్రపంచ సమావేశాల్లో ఒకటిగా అవతరించింది.  2023లో సింగపూర్‌లో నిర్వహించిన గత మహా సభలో 100 దేశాలను ప్రాతినిధ్యం వహించిన 3,000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని, సాంకేతిక రంగంలో తెలుగు వృత్తిపరుల ప్రపంచంలో వివిధ దేశాల్లో జరుగుతున్న మార్పులు, అధునాతన సాంకేతికతపై పెద్ద ఎత్తున్న చర్చించారు. 2025లో దుబాయ్‌లో జరగబోయే ఈ మహా సభ విజయ వారసత్వాన్ని కొనసాగిస్తూ, 2027లో జరగబోయే తదుపరి ద్వైవార్షిక ఎడిషన్‌కు వేదికను ఏర్పాటు చేస్తుంది.

ఈ ప్రాముఖ్యమైన కార్యక్రమం ద్వారా 100కి పైగా దేశాల నుంచి తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, మరియు ఆవిష్కర్తలు ఒక వేదికపైకి రానున్నారు.ఈ మహా సభ సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), బ్లాక్‌చైన్, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ డిజైన్, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫిన్‌టెక్ మరియు డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ వంటి అత్యాధునిక రంగాల్లో జరుగుతున్న పురోగతులను ప్రదర్శించనున్నారు. యూఏఈ ప్రభుత్వానికి చెందిన మంత్రులు, రాజ కుటుంబ ప్రతినిధులు, విధాననిర్మాతలు అలాగే ఆసియా, యూరప్ మరియు ఉత్తర అమెరికా నుండి వచ్చే అంతర్జాతీయ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి తమ అధికారిక మద్దతును ప్రకటించాయి. రెండు రాష్ట్రాలు కూడా ఈ కాన్ఫరెన్స్‌లో తమ ప్రధాన సాంకేతిక, స్టార్టప్ మరియు ఆవిష్కరణ కార్యక్రమాలను ప్రదర్శించనున్నాయి.  రెండు రాష్ట్రాల నుండి ముఖ్యాధికారులు మరియు మంత్రులు పాల్గొని, తమ డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ రోడ్‌మ్యాప్స్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను వివరించనున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా భారతదేశం ఒక గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా ఉన్న స్థాయిని మరింత బలపరచనుంది.

ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సిద్ధంగా ఉండేందుకు, ​​డబ్ల్యూటిఐటిసి దుబాయ్ లీడర్‌షిప్ టీమ్ ఇటీవల దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో ఒక ప్రణాళికా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 40 మందికి పైగా కోర్ సభ్యులు మరియు నిర్వాహకులు పాల్గొని, ఈ​ మహా సభకు సంబంధించిన లాజిస్టిక్స్ మరియు అమలు ప్రణాళికలను తుది రూపమిచ్చారు.​ ఈ సమావేశానికి ​డబ్ల్యూటిఐటిసి అంతర్జాతీయ సమన్వయకర్తలు, యూఏఈ చాప్టర్ నాయకులు, మరియు ప్రముఖ ఐటీ నిపుణులు హాజరయ్యారు.ఈ సమావేశం ద్వారా భారతదేశం వెలుపల జరగబోయే ​అతిపెద్ద తెలుగు సాంకేతిక సదస్సు కోసం అధికారికంగా ప్రారంభమైనట్లు గుర్తించబడింది.

ఈ కార్యక్రమంలోని ప్రధాన ఆకర్షణగా 2026–2028 కాలానికి నియమించబడిన డబ్ల్యూటిఐటిసి  గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్ యొక్క గ్రాండ్ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నాయకత్వం మరియు సహకారంలో ఒక కొత్త యుగానికి నాందిగా నిలవనుంది.

“సింగపూర్‌లో పొందిన అపార విజయానంతరం, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సాంకేతిక నిపుణులను ఏకైకంగా కలపడానికి మా తదుపరి స్థానం దుబాయ్ అవుతుంది,” అని  డబ్ల్యూటిఐటిసి ఛైర్మన్ సందీప్ కుమార్ మక్తాలా తెలిపారు.“ఈ మహా సభ కేవలం సాంకేతికత గురించి కాదు,ఇది తెలుగు గౌరవం, ఆవిష్కరణ, మరియు ప్రపంచ వేదికపై నాయకత్వం గురించి” అని ఆయన పేర్కొన్నారు.

డబ్ల్యూటిఐటిసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్‌లు, పరిశోధకులు, అకాడెమిక్‌లు మరియు వ్యాపార నాయకులు ఈ చారిత్రక కార్యక్రమంలో పాల్గొనడానికి ఆహ్వానిస్తున్నది.  ప్రతినిధులు, ప్రసంగకారులు, స్పాన్సర్లు మరియు భాగస్వాముల కోసం నమోదులు ఇప్పుడు ప్రారంభం అయ్యాయి.  

రిజిస్ట్రేషన్ మరియు వివరాల కోసం, http://www.wtitc.org లో సందర్శించండి లేదా +91 81231 23434 (ఇండియా) | +971 56577 8923 (యూఏఈ) ని సంప్రదించండి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com