పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు

- November 10, 2025 , by Maagulf
పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు

హైదరాబాద్: తెలంగాణ పర్యాటక రంగం చరిత్రలోనే తొలిసారిగా భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో పాటు దేశీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి మొత్తం రూ. 13,819 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 17,960 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి.

పర్యాటక శాఖ వివరాల ప్రకారం, ప్రభుత్వం భాగస్వామ్యంతో 14 ప్రాజెక్టులు రూ. 7,081 కోట్లతో చేపట్టబోతుండగా, పూర్తిగా ప్రైవేట్ రంగం ఆధారంగా 17 ప్రాజెక్టులు రూ. 6,738 కోట్లతో అమలవుతున్నాయి. వీటివల్ల వికారాబాద్, నాగార్జునసాగర్, బుద్ధవనం, సోమశిల, అమ్రాబాద్ వంటి ప్రాంతాల్లో ఎకో, అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందనున్నాయి.

ఈ పెట్టుబడులలో భాగంగా ట్రెక్కింగ్ మార్గాలు, సఫారీలు, ఫారెస్ట్ రిసార్టులు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్‌లోని అనంతగిరి హిల్స్‌లో మేఘా ఇంజనీరింగ్ సంస్థ రూ. 1,021 కోట్లతో లగ్జరీ “లా వీ వెల్‌నెస్ రిట్రీట్” నిర్మిస్తోంది. అలాగే బుద్ధవనంలో వెడ్డింగ్, వెల్‌నెస్ సెంటర్లు నిర్మాణంలో ఉన్నాయి. మహాబోధి సొసైటీ, థైవాన్ ఫోగువాంగ్ షాన్ సంస్థలు కూడా బౌద్ధ ధ్యాన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాయి.

సోమశిలను డెస్టినేషన్ వెడ్డింగ్, అడ్వెంచర్ టూరిజం హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. రామోజీ గ్రూప్ రూ. 2,000 కోట్లతో కొత్త ఆకర్షణలు తీసుకురానుంది. అదే విధంగా మాస్టా స్టూడియోస్ రూ. 550 కోట్లతో “బాహుబలి థీమ్ పార్క్” నిర్మిస్తోంది.

హైదరాబాద్ నగరంలో అంతర్జాతీయ హోటల్ బ్రాండ్‌లు స్థాపన దిశగా అడుగులు వేస్తున్నాయి.ప్రెస్టీజ్ గ్రూప్ రాయదుర్గంలో ఒబెరాయ్ హోటల్, బుద్వెల్‌లో సెయింట్ రెజిస్ హోటల్, శంషాబాద్‌లో సిటాడెల్ హోటల్స్ రూ. 500 కోట్లతో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, నియోపోలిస్‌లో బ్రిగేడ్ గ్రూప్ ఇంటర్‌కాంటినెంటల్ హోటల్ ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.

ఈ భారీ పెట్టుబడులతో తెలంగాణ పర్యాటక రంగం అంతర్జాతీయ గుర్తింపు పొందబోతోంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడడమే కాకుండా, తెలంగాణను ప్రపంచ టూరిజం మ్యాప్‌పై ముఖ్య గమ్యస్థానంగా నిలబెట్టనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com