ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు

- January 19, 2026 , by Maagulf
ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు

భారతీయ సినీ సంగీత చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సంగీత దిగ్గజం ఇళయరాజా, గత ఐదు దశాబ్దాలకు పైగా సంగీత ప్రయాణంలో వేలాది గీతాలను స్వరపరిచిన ఆయన ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. తాజాగా ఆయనకు మరో ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన అజంతా–ఎల్లోరా అంతర్జాతీయ చిత్రోత్సవం (AIFF) ఈ ఏడాది తన అత్యున్నత పురస్కారం ‘పద్మపాణి’ అవార్డును ఇళయరాజాకు ప్రకటించింది. Ajanta–Ellora International Film Festival (AIFF) ఈసారి 11వ ఎడిషన్‌ను జనవరి 28 నుంచి ఫిబ్రవరి 1, 2026 వరకు నిర్వహించనున్నారు.

ఈ ఏడాది ఫెస్టివల్‌లో అత్యంత ప్రతిష్టాత్మక గౌరవంగా భావించే పద్మపాణి అవార్డు ను ఇళయరాజాకు అందజేయనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ విషయాన్ని AIFF ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ నందకిషోర్ కాగ్లివాల్, చీఫ్ మెంటర్ అంకుష్‌రావ్ కదమ్, ఫెస్టివల్ గౌరవ ఛైర్మన్ అశుతోష్ గోవారికర్ సంయుక్తంగా ప్రకటించారు. పద్మపాణి అవార్డు ఎంపిక కమిటీలో ప్రముఖ సినీ విమర్శకురాలు లతికా పద్గావ్కర్ (చైర్‌పర్సన్), దర్శకుడు అశుతోష్ గోవారికర్, సునీల్ సుక్తంకర్, చంద్రకాంత్ కులకర్ణి సభ్యులుగా ఉన్నారు.

వారి ఏకగ్రీవ నిర్ణయంతో ఇళయరాజా పేరును ఈ గౌరవానికి ఎంపిక చేశారు. పద్మపాణి అవార్డులో ప్రత్యేక మేమెంటో, గౌరవ పత్రం, అలాగే రూ.2 లక్షల నగదు పురస్కారం ఉంటాయి. ఈ అవార్డును 2026 జనవరి 28న సాయంత్రం 5.30 గంటలకు, ఛత్రపతి సంభాజీనగర్‌లోని ఎంజీఎం క్యాంపస్‌లో ఉన్న రుక్మిణి ఆడిటోరియంలో జరిగే ప్రారంభోత్సవంలో అందజేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com