ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..

- January 22, 2026 , by Maagulf
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..

హైదరాబాద్: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కు చెందిన మరో కీలక నేతకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను విచారణకు హాజరుకావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి సిట్ ఈ నెల 20న హరీశ్ రావును పిలిపించి విచారించింది. సుమారు 7 గంటల పాటు హరీశ్ రావును సిట్ విచారించింది. అవసరం అయితే మళ్లీ పిలుస్తామని సీపీ సజ్జనార్ తెలిపారు.

ఇప్పుడు తాజాగా కేటీఆర్ కు కూడా నోటీసులు జారీ చేసింది సిట్. కేటీఆర్ ప్రస్తుతం సిరిసిల్లలో ఉన్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని ఆయన నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఈ నెల 23వ తేదీ ఉదయం 11 గంటకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా సిట్ నోటీసుల్లో పేర్కొంది.

కేటీఆర్ కి సిట్ నోటీసులు నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు తెలంగాణ భవన్ కి రానున్నారు. తెలంగాణ భవన్ నుంచి సిట్ విచారణకి కేటీఆర్ వెళ్లనున్నారు. తెలంగాణ భవన్ లోనే ఉండి హరీశ్ రావు మానిటరింగ్ చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com