ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం

- March 09, 2026 , by Maagulf
ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రకాష్ స్టూడియోస్‌లో వంశీ ఆర్ట్స్ థియేటర్స్ నిర్వహణలో వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి జమున కుమార్తె, ప్రముఖ చిత్రకారిణి స్రవంతి జూలూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్రవంతి జూలూరి మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఒకరోజు మాత్రమే జరుపుకోవాల్సిన అవసరం లేదని, స్త్రీగా పుట్టిన ప్రతి రోజూ గర్వపడే రోజు కావాలని అన్నారు. తల్లి పిల్లలకు ప్రథమ గురువని, వారు తమ సంతానానికి మంచి సంస్కారం నేర్పాల్సిన బాధ్యత కలిగి ఉంటారని చెప్పారు. ఈ బాధ్యత ఒక గొప్ప శక్తి అని, అందుకే స్త్రీగా పుట్టినందుకు గర్వపడాలని సూచించారు.

కార్యక్రమ నిర్వాహకుడు వంశీ రామరాజు మాట్లాడుతూ తన తల్లి జమునతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉన్నదని గుర్తు చేసుకున్నారు.

విశిష్ట మహిళా పురస్కారం అందుకున్న దూరదర్శన్ డైరెక్టర్ కామేశ్వరి మాట్లాడుతూ, మహిళలు సమాజంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత వారి మీదే ఉంటుందని అన్నారు.

విదేశీ భారతీయురాలు మంజు భార్గవ (అమెరికా) మాట్లాడుతూ జమున–వంశీ పేరుతో పురస్కారం అందుకోవడం తనకు గర్వకారణమని తెలిపారు.

ప్రఖ్యాత గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ మాట్లాడుతూ నేటి మహిళలు ఉద్యోగం, ఇంటిపనులు, పిల్లల పెంపకం వంటి అనేక బాధ్యతల మధ్య తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. కుటుంబ పనుల్లో భాగస్వామిని కూడా భాగస్వామ్యం చేయాలని అన్నారు. వయస్సు పెరిగే కొద్దీ స్త్రీలకు వచ్చే శారీరక మార్పులు సహజమని, వాటిని మానసికంగా తీసుకుని కృంగిపోవద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సేవ, సంగీతం, సాహిత్య రంగాల్లో విశేష సేవలందించిన 35 మంది విశిష్ట మహిళలకు పురస్కారాలు ప్రదానం చేశారు. కార్యక్రమాన్ని శైలజ సుంకరపల్లి, సుధామయి పర్యవేక్షించారు. ప్రారంభంలో సరస్వతి కరవాది ప్రదర్శించిన జమున ఏకపాత్రాభినయం ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com