అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు

- March 12, 2026 , by Maagulf
అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు

న్యూఢిల్లీ: భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి మరియు ‘అటల్ స్మృతి న్యాస్ సొసైటీ’ అధ్యక్షులు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇవాళ ఢిల్లీలో 1, త్యాగరాజ్ మార్గ్ లో ఉన్న తమ అధికారిక నివాసంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అటల్ జీ తో పని చేసిన పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు.భారతదేశ గౌరవ పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం, వారు పాటించిన విలువలు మరియు దేశానికి వారు అందించిన అసమానమైన సేవలను గౌరవించుకోవడంతో పాటు, వారి వారసత్వాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా అటల్ స్మృతి న్యాస్ సొసైటీ చేపట్టబోయే వివిధ కార్యక్రమాలపై వెంకయ్య నాయుడు సుదీర్ఘంగా చర్చించారు.

భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, జి.కిషన్ రెడ్డి, పూర్వకేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ,సయ్యద్ షానవాజ్ హుస్సేన్,  రాజీవ్ ప్రతాప్ రూడీ,ఏబీవీపీ (ABVP) పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ భాటియా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పూర్వ ప్రధాని అటల్ జీకి మీడియా సలహాదారు అశోక్ టాండన్, పూర్వ ప్రధానికి నాటి ఓఎస్‌డీ రాజ్ కుమార్ శర్మ తదితరులతో చర్చించారు.

ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..అటల్ జీ ఒక మహోన్నత నాయకుడని, ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సొసైటీ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు అటల్ జీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సొసైటీ కార్యకలాపాలకు తమ పూర్తి సహకారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com